తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ను తదుపరి ముఖ్యమంత్రిని చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ తనయుడిని వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ ఎన్నికలు మాత్రం తన సారథ్యంలోనే వెళ్లేలా ప్లాన్ చేసుకున్నప్పటికీ అంతా కేటీఆర్ చేతుల మీదుగానే నడిచేలా ఇప్పటి నుంచే ఆయన కుమారుడికోసం ఒక మ్యాప్ను అయితే సిద్ధం చేసుకున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని…
ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్కు అప్పగించారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో నిరంతరం కేటీఆర్ సమావేశమవుతున్నారు. వారి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖాధిపతులతో మాట్లాడి ఎమ్మెల్యేల సమస్యలను పరిష్కరిస్తూ వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే గెలుపు గుర్రాలు అవసరమని కేటీఆర్కు తెలుసు. అందుకే తన సొంతంగా కూడా సర్వేలు చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదికలు కూడా ఇస్తున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన అధికారులతో సమీక్షలు తప్ప అంతా కేటీఆర్ కనుసన్నల్లోనే పాలన జరుగుతుంది.
అన్ని కార్యక్రమాలు…
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల వంటి వాటి విషయంలోనూ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం వంటివి కూడా కేటీఆర్కే అప్పగించారు. పార్టీ వ్యవహారాల నుంచి ప్రభుత్వ పాలన వరకూ అంతా కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నా అది అనధికారికంగా మాత్రమే. ముఖ్యమైన నిర్ణయాలు కేసీఆర్ దృష్టిికి తీసుకొచ్చి వాటిని అమలు చేసే బాధ్యతను కూడా కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రచారంలో కూడా కేటీఆర్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం లేదు కనుక, కేటీఆర్ 119 నియోజకవర్గాలను చుట్టివచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని సమాచారం.
క్యూ కడుతున్న నేతలు…
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు దఫాలు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ మూడో దఫా మాత్రం కుమారుడికి ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు. అయితే అది ఎన్నికల అనంతరమే. అందుకోసమే కేటీఆర్కు పార్టీ పరంగా, పాలనపరంగా పట్టు చిక్కేందుకు ఇప్పటి నుంచే అవకాశం కల్పించేలా కేసీఆర్ ఇప్పటి నుంచే ఆయన చేత ప్రాక్టీస్ చేయిస్తున్నారని గులాబీ పార్టీలో నేతలు చెబుతున్నారు. అందుకే కేటీఆర్ ను కలిసేందుకు ఎక్కువ మంది ఉత్సాహ పడుతున్నారు. తమకు టిక్కెట్ రావాలన్నా, తమకు పార్టీలో పదవులు దక్కాలన్నా కేటీఆర్ను ఇప్పటి నుంచే కాకా పడుతున్న నేతలు ఇటీవల కాలంలో ఎక్కువయిపోయారు. వచ్చే ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపడతారన్న ప్రచారం మాత్రం బీఆర్ఎస్ పార్టీలో బాగా జరుగుతుంది.