జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి విడత వారాహి యాత్ర ముగిసింది. మరో విడత యాత్ర ఆయన కొద్దిరోజుల్లోనే మొదలు పెట్టనున్నారు. రెండోదఫా కూడా ఉభయ గోదావరి జిల్లాల్లోనే చేయాలని పవన్ దాదాపుగా నిర్ణయించారు. అయితే తొలి విడత యాత్రలో పవన్ పై ప్రశంసలతో పాటు అంతే స్థాయిలో విమర్శలు కూడా వినిపించాయి. వైసీపీ ట్రాప్ లో పవన్ పడ్డారన్న కామెంట్స్ కూడా వినిపించాయి. వైసీపీ నేతలు రెచ్చగొట్టడంతో పవన్ కూడా రెచ్చి పోయి తాను యాత్ర చేపట్టింది ఎందుకన్న విషయాన్ని మర్చిపోయినట్లు వ్యవహరించారనిపిస్తోంది. వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్పించి నిర్దిష్టమైన ప్రణాళికతో యాత్ర సాగలేదన్నది జనసైనికులు కూడా అంగీకరిస్తున్నారు.
అంచనాలకు విరుద్ధంగా…
పవన్ వారాహి యాత్ర అన్నవరంలో ప్రారంభమైనప్పుడు జనసేన నేతలతో పాటు క్యాడర్ కూడా ఎంతో ఊహించుకుంది. అభ్యర్థులను ప్రకటించకపోయినా కొన్ని ప్రాంతాల్లో నేతలను తన వాహనంపైకి తీసుకుని వెళ్లి పరిచయం చేస్తారని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పవన్ ఒక్కరే యాత్రలో ప్రసంగాలు చేసుకుంటూ వెళ్లారు. పార్టీ కోసం కష్టపడిన నేతలను జనానికి పరిచయం చేయడం మాని, కేవలం ప్రభుత్వంపై దండెత్తడమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు వినిపించాయి. అంతేకాదు విమర్శల్లో కూడా పెద్దగా విషయం లేదన్నది స్పష్టమవ్వడంతో జనసేన నేతలు తమ అంచనాలకు భిన్నంగా జరిగాయన్ననిరాశకు లోనయ్యారు.
స్పందన మాత్రం…
అన్నవరం నుంచి భీమవరం వరకూ జరిగిన వారాహి యాత్రకు పెద్దయెత్తున స్పందన లభించింది. జనం కూడా పవన్ ను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు తరలి వచ్చారు. పవన్ అభిమానులు కావచ్చు. జనసేన క్యాడర్ కావచ్చు పెద్దసంఖ్యలో వచ్చి వారాహి యాత్రను విజయవంతం చేశారు. అయితే పవన్ మాత్రం ముఖ్యమంత్రి పదవి పై క్లారిటీ మాత్రం ఇవ్వలేకపోయారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసిన పవన్, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ అభ్యర్థించడం కూడా జనసైనికులకు నచ్చలేదు. గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలవ్వడంతో ఆయన దీనంగా అడగడం కూడా ఆయన వీరాభిమానులను హర్ట్ చేసే విధంగా ఉంది.
రెండో విడతలోనైనా…
దీంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేయగలమోనన్న స్పష్టతను జనసేనాని ఇవ్వలేకపోయారు. సవాళ్లు… డైలాగులతో తన ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టించుకోగలిగారు తప్ప.. సామాన్య జనాలకు మాత్రం ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయారు. ఆయన రూట్ మ్యాప్ లేకుండానే రోడ్డు మీదకు వచ్చారన్న వ్యాఖ్యలు కూడా జనం నుంచి వినిపించాయి. వైసీపీ నేతలను, ముఖ్యమంత్రి జగన్ ను తిట్టడం, ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 స్థానాలను వైసీపీకి రానివ్వనంటూ ఛాలెంజ్ లు చేయడం వంటివి కొంచెం వెగటు పుట్టించే విధంగా ఉన్నాయి. గతంలోనూ జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. ఇది నా శాసనం అంటూ చెప్పిన పవన్ మరోసారి అదేరకమైన వ్యాఖ్యలు చేసి నవ్వులపాలయ్యారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కన్పించాయి. మొత్తం మీద వారాహి యాత్ర ఒకరకంగా విజయవంతమైనప్పటికీ… అనుకున్నలక్ష్యాన్ని మాత్రం సాధించలేదనే చెప్పాలి. కనీసం రెండో విడత యాత్రలోనైనా పవన్ కొంచెం ప్రిపేర్ అయి, నిర్దుష్ట ఎజెండాతో జనం ముందుకు వస్తే బాగుంటుందని జనసైనికుల అభిప్రాయంగా ఉంది.
Follow Us On : YouTube , Google News