ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి టీడీపీ, జనసేనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో మూతబడిన చిత్తూరు డెయిరీని పునరుద్ధరణ పనులకు జగన్ ఈరోజు భూమి పూజ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. హెరిటేజ్ డెయిరీ కోసం చంద్రబాబు చిత్తూరు డెయిరీని మూసివేశారని ఆరోపించారు. హెరిటేజ్ లాభాల బాటలో పట్టేందుకు చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసివేశారన్న జగన్ చిత్తూరు జిల్లా రైతులను నిలువునా ముంచేశారన్నారు.
సొంత జిల్లా రైతులనే…
తన స్వార్థం కోసం సొంత జిల్లా రైతులనే టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశాడన్నారు. చిత్తూరు డెయిరీ మూతబడటంతో రైతులు నిలువునా మునిగిపోయారన్నారు. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామని జగన్ రైతుల హర్షధ్వనాల మధ్య తెలిపారు. చిత్తూరు డెయిరీ లాభాల్లో ఉంటే నష్టాలు వస్తున్నాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. మరి హెరిటేజ్ కు ఎలా లాభాలు వచ్చాయని జగన్ ప్రశ్నించారు.
రైతులకు లాభం…
చిత్తూరు డెయిరీ పునరుద్ధరణతో రాయలసీమ, నెల్లూరు జిల్లా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో అమూల్ వచ్చిన తర్వాతనే లీటరు పాల ధర 67 రూపాయల నుంచి 89 రూపాయలకు పెరిగిందని, ఇది రైతులకు లాభం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చిత్తూరు జిల్లాకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కలసి తనను ఓడించడానికి అనేక కుట్రలు చేస్తున్నారని, దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉంటే తనకు చాలునని జగన్ అన్నారు. ప్రతి ఇంటికి మంచి జరిగిందని భావిస్తేనే తమకు ఓటు వేయాలని జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.