ఓటర్ల నమోదు ప్రక్రియలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ప్రస్తుతం తయారవుతున్న ఓటర్ల జాబితాలో వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందిని నియమించడంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ప్రభుత్వ జోక్యం ఓటర్ల నమోదులో ఉండేది కాదని స్పష్టం చేసిన ఆయన… గతంలో మున్సిపల్, పంచాయతీ సిబ్బంది ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించేవారన్నారు. దొంగ ఓట్లంటూ అసలైన ఓటర్లను కూడా జాబితా నుంచి తొలగిస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న వార్డు సెక్రటేరియట్ లు వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయని ఆయన ధ్వజమెత్తారు.
సచివాలయ సిబ్బందితో…
ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గంలో సచివాలయ ఉద్యోగుల సమన్వయ కర్త పేరిట తన సొంత మనిషిని నియమించుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తహసిల్దార్లు, కమిషనర్లు కూడా సమన్వయకర్త సూచించిన విధంగానే పనిచేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దుయ్యబట్టారు. ఓటర్లను తొలగించాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చి మరీ తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగిస్తున్నారంటూ ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. సచివాలయాల సిబ్బంది బదిలీలు జరగని కారణంగా స్థానిక వైసీపీ నేతలతో సాన్నిహిత్యం ఏర్పరచుకుని వివక్ష చూపుతున్నారని ఆయన మండి పడ్డారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఓటర్ల తొలగింపులో జరుగుతున్న అవకతవకలను నివారించాలని ఆయన డిమాండ్ చేశారు.
Follow Us On : YouTube , Google News