ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జగన్ కలవనున్నారు. రాష్ట్ర విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. అలాగే సాయంత్రం 4.30 గంటలకు జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ లు ఖరారయ్యాయి. ప్రధానితో జరగనున్న సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించనున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న…
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగేళ్లు ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా ఉన్న జగన్ భవిష్యత్ లోనూ అదే తరహా వైఖరిని అవలంబిస్తానని ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి చెప్పినట్లు తెలిసింది. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ లోగా నిధులు విడుదల చేయించుకోవాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రత్యేక ప్యాకేజీని…
ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన జగన్ రాష్ట్ర్రానికి అవసరమైన నిధులను రప్పించుకోగలిగారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులను తెచ్చుకున్నారు. ఈ పర్యటనలో ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాల్సిందిగా కోరనున్నారు. ముఖ్యంగా వెనకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీని తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్యాకేజీ విడుదలకు కేంద్రప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను కలసి పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
Follow Us On : YouTube , Google News