ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ మొదలయింది. రాజకీయ నాయకుల యాత్రలతో పాటు ఏపీలో పలు సంస్థల సర్వేలు కూడా కాక పుట్టిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. జగన్ ఓటు బ్యాంకు గతం కంటే పెరిగిందా? తగ్గిందా? చంద్రబాబు తిరిగి పుంజుకున్నాడా? పవన్ కల్యాణ్ తన ఓట్ల శాతాన్ని ఆరు నుంచి ఎంత వరకూ పెంచుకోగలిగాడు? వంటి అంశాలే ప్రధానంగా చర్చగా మారాయి. అయితే దీనికి ఎలాంటి ప్రాతిపదిక లేకపోయినా వారు సొంతంగా చేయించుకుంటున్న సర్వేలతో ఎవరికి వారే తమ ఓటు బ్యాంకు పెరిగిందని భావిస్తున్నారు. గత ఎన్నికల కంటే తమ పరిస్థితి బాగా మెరుగుపడిందని ఎవరికి వారే జబ్బలు చరుచుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని విపక్షాలు అంటుంటే.. తమకు పాజిటివ్ ఓటు పెరిగిందని అధికార పార్టీ ధీమాగా కనిపిస్తుంది.
పాజిటివ్ ఓటు…
గత ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి 50 శాతం ఓట్లు వచ్చాయి. అంటే పోలయిన ఓట్లలో 51 శాతం ఫ్యాన్ పార్టీకే పడ్డాయి. తాము నాలుగేళ్ల నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలు పాజిటివ్ ఓటును మరింత పెంచాయన్నది అధికార పార్టీ అంచనా. గతం కంటే తమ పరిస్థితి మెరుగ్గా ఉందన్నఅభిప్రాయం అధికార పార్టీలో వ్యక్తమవుతుంది. కరోనా వంటి కష్టసమయంలోనూ ప్రజలను ఆదుకున్న తీరు, సంక్షేమ పథకాలను చెప్పిన సమయానికి ఇస్తున్న విధానం పట్ల జనం ఆకర్షితులవుతున్నారన్నది వైసీపీ నేతల వాదన. పార్టీలకతీతంగా వెల్ఫేర్ స్కీమ్ లు అమలు చేయడంతో విపక్ష ఓట్లుకూడా తమ ఖాతాలో పడతాయంటున్నారు. జగన్ అధికారంలోకి రాకుంటే తమకు అందే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తుందంటున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని, దీంతో తమకు పాజిటివ్ ఓటు పెరిగిందని, గతం కంటే ఎక్కువ శాతం ఓట్లు వస్తాయన్నది వైసీపీ లీడర్స్ లెక్కలు వేసుకుంటున్నారు.
టీడీపీ ధీమా ఇదే…
మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా బిందాస్ గా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉందని చెబుతుంది. ఇందుకు లోకేష్ పాదయాత్ర, తమ పర్యటనలలో జనం నుంచి వస్తున్న స్పందనలే నిదర్శనమని ఉదహరిస్తుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోతే తమ కార్యక్రమాలు అంతగా సక్సెస్ కావని కూడా తెలుగుతమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. లోకల్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో పాటు అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగం వంటి వాటితో యువత తమ వైపు చూస్తుందని నమ్మకంగా టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నేతల దోపిడీతో పాటు, శాంతిభద్రతల సమస్య కూడా తమకు అనుకూలంగా మారుతుందన్న అంచనాలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 39 శాతం ఓట్ల వరకూ వచ్చాయి. ఇప్పుడు మరింత పెరిగే అవకాశముందన్నది తెలుగుదేశం పార్టీ నేతలు అంచనాగా వినిపిస్తుంది. అంతేకాదు..మరోసారి జగన్ కు అవకాశమిస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతుందన్న అభిప్రాయంలో ప్రజలు ఉన్నారన్నది తాము చేయించిన సర్వేల ద్వారా తేటతెల్లమవుతుందని సైకిల్ పార్టీ నేతలు చెబుతున్నారు.
జనసేన లెక్క ఏంటంటే…
జనసేన పార్టీ కూడా తన ఓటు శాతం పెంచుకుందన్న భావనలోనే ఉంది. గత ఎన్నికల్లో జనసేనకు ఆరు నుంచి ఏడు శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు తమకు అనుకూలంగా పడే ఓటు శాతం డబుల్ డిజిట్ కు చేరుకుందంటున్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని అంటున్నారు. టీడీపీ,జనసేన కలసి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం తమదే అవుతుందని, వందకు పైగా స్థానాలను రెండు పార్టీలు దక్కించుకుంటాయని జనసైనికులు చెబుతున్నారు. పొత్తులపై ఇంకా అధికారికంగా నిర్ణయం జరగనప్పటికీ, క్యాడర్ తో పాటు ఓట్లు కూడా కలసి పోయాయన్నది జనసేన నేతల అభిప్రాయంగా వినిపిస్తుంది. మొత్తం మీద ఏపీలో మూడు ప్రధాన పార్టీలు తమకు గతం కంటే పెరిగిన పాజిటివ్ ఓటును లెక్క వేసకుంటున్నారు. అధికారం ఈసారి తమదేనన్న పూర్తి విశ్వాసంతో ఉన్నారు. చివరకు ఎవరిది విజయం అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత కాని తేలదు.
Follow Us On : YouTube , Google News