తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీవారి హుండీ ఆలయ ముఖద్వారం దగ్గర హుండీ జారి కింద పడిపోయింది. శ్రీవారి హుండీని ఆలయం నుంచి పరకామణి మండపానికి తరలిస్తున్న సమయంలో మహాద్వారం దగ్గర హుండీ కిందపడింది. ఆ సమయంలో హుండీలో నుంచి కానుకలు కిందపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కానుకలను జాగ్రత్తగా తిరిగి ట్రాలీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి లారీ పరాకామణి మండపానికి వెళ్లింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హుండీ కింద పడి పోయినట్లు టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
శ్రీవారి ఆలయంలో హుండీలు ఏర్పాటు చేశారు.. భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ నిండిన తర్వాత ఆలయం వెలుపలికి తీసుకువచ్చి లారీలో నూతన పరకామణికి తీసుకువెళతారు. ఇలా హుండీని పరకామణికి తీసుకువెళ్లే క్రమంలో ఆలయం వెలుపల లారీలోకి ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగింది. హుండీని లారీలోకి జాగ్రత్తగా ఎక్కించారు. సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమల వస్తుంటారు. శ్రీవారికి భక్తులు కచ్చితంగా కానుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. డబ్బులు, బంగారం, ఇతర వస్తువల రూపంలో భక్తులు కాసులు సమర్పిస్తారు. ఇలా ప్రతి రోజు శ్రీవారికి హుండీ ద్వారా కోట్లలో ఆదాయం వస్తుంది. అందుకే శ్రీవారి హుండీని కూడా భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు హుండీ కింద పడిపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
Follow Us On : YouTube , Google News