వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి ప్రత్యర్థులను మట్టికరిపించాలన్న వ్యూహంతో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళుతున్నారు. పక్కా ప్లాన్ ను అమలు చేస్తున్నారు. సిఫార్సులు, మొహమాటానికి పోకుండా గెలుపు అవకాశాలున్న వారినే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే అధిక స్థానాలను దక్కించుకోవాలన్న ఆలోచనతో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కీలకమైన నేతలను కూడా పక్కన పెట్టేందుకు జగన్ వెనకాడటం లేదు. అన్ని లెక్కలు వేసుకుని, ఆ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయితే ప్రజలు మొగ్గు
చూపుతారని నివేదికలు అందుతాయో వారినే ఎంపిక చేస్తున్నారు.
మూడు సీట్లు…
గత ఎన్నికల్లో రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో మూడు సీట్లు మాత్రమే విపక్ష టీడీపీకి దక్కాయి. ఈసారి వాటిని కూడా విపక్ష పార్టీకి రానివ్వకుండా చేయాలన్న స్ట్రాటజీతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, హిందూపురం, చిత్తూరు జిల్లాలోని కుప్పం మాత్రమే వైసీపీ చేజారి పోయాయి. ఇప్పటికే కుప్పం పై ఫోకస్ పెట్టిన జగన్ వైసీపీ ఇన్ ఛార్జి భరత్ ను ఎమ్మెల్సీని కూడా చేశారు. చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని భరత్ ను జగన్ ఆదేశించారు. కుప్పం నియోజకవర్గానికి అవసరమైన నిధులను కూడా విడుదల చేస్తూ కొంత
టీడీపీ అధినేతకు ఇబ్బంది పెడుతున్నారు.
అదే టార్గెట్…
అలాగే హిందూపురం నియోజకవర్గంలో కూడా వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నది జగన్ టార్గెట్ గా ఉంది. హిందూపురం ఇప్పటి వరకూ టీడీపీ తప్ప మరో పార్టీ గెలిచిన అవకాశాలు లేవు. అక్కడ చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. నందమూరి కుటుంబానికి హిందూపురం కంచుకోట వంటిది. ఈసారి బాలయ్యను దెబ్బతీయాలన్న ఉద్దేశ్యంతో జగన్ అడుగులు పడుతున్నాయనే చెప్పాలి. హిందూపురం నియోజకవర్గానికి ఇప్పటివరకూ వైసీపీ ఇన్ ఛార్జిగా మహ్మద్ ఇక్బాల్ ఉన్నారు. ఆయన గత ఎన్నికలలో ఓటమి పాలయిన తర్వాత ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. అయితే ఈసారి ఇక్బాల్ కు అవకాశం ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేరు.
ఇన్ ఛార్జి మార్పు…
ఇక్బాల్ స్థానంలో కొత్తగా దీపికను హిందూపురం ఇన్ ఛార్జిగా నియమించారు. దీపిక బీసీ సామాజికవర్గానికి చెందిన వారు. ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి. రెండు సామాజికవర్గాలు కలిస్తే బాలకృష్ణ మీద గెలుపు సులువవుతుందన్న అంచనాతో ఉన్నారు. అందుకోసమే దీపికను ప్రత్యేకంగా ఎంపికను చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హిందూపురంలో నందమూరి కుటుంబ వరస విజయాలకు చెక్ పెట్టాలంటే దీపిక సరైన అభ్యర్థి అని భావిస్తున్నారు. ఇక్బాల్ ను హిందూపురం స్థానిక వైసీపీ నాయకత్వం కూడా ఓన్ చేసుకోకపోవడం, గ్రూపు తగాదాల కారణంగానే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని భావించిన వైసీపీ
హైకమాండ్ కొత్తగా దీపికను బరిలోకి దించనుంది. హిందూపురంలో వచ్చే ఎన్నికల్లో బాలయ్య పై పోటీకి జగన్ చేస్తున్న ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందన్నది చూడాలి.
Follow Us On : YouTube , Google News