పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. తొలి విడత యాత్రలో అన్నవరం నుంచి భీమవరం వరకూ పర్యటించిన పవన్ కల్యాణ్ యాత్రకు ఫ్యాన్స్,పార్టీ కార్యకర్తల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ప్రచారంతో పవన్ కల్యాణ్ మలి విడత యాత్ర చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. తొలి విడత యాత్ర పదిహేడు రోజుల పాటు సాగింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ముఖ్యమైన నియోజకవర్గాల్లో పవన్ పర్యటించారు. యాత్రకు వస్తున్న రెస్పాన్స్ ను చూసి ఆ వేడి తగ్గకుండా యాత్రను కొనసాగించాలని పవన్ భావిస్తున్నారు.
ఈ నెల 9 నుంచి…
పవన్ కల్యాణ్ తన మలి విడత వారాహి యాత్ర ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 9వ తేదీన ఏలూరులో బహిరంగ సభ పవన్ నిర్వహించనున్నారు. ఆ బహిరంగ సభతో రెండో విడత యాత్ర ప్రారంభమవుతుందన్నది జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. నిన్నమంగళగిరికి చేరుకున్న పవన్ కల్యాణ్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయి రెండో విడత యాత్రపై చర్చించారు. అయితే ఈసారి ఏలూరు నుంచి ప్రారంభించి ఎక్కడ ముగించాలన్న దానిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. రెండో విడత వారాహి యాత్ర రూట్ మ్యాప్ ను సిద్ధం చేసేందుకు నేడు పవన్ కల్యాణ్ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రెండో విడత యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ వరకూ అన్న దానిపై క్లారిటీ రానుంది.
రెండో విడత యాత్రలో…
ఏలూరులో ప్రారంభించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. రెండు జిల్లాలను కవర్ చేసినట్లవుతుందని భావిస్తున్నారు. మరో పదిహేను రోజుల పాటు జనసేనాని రెండో విడత యాత్ర జరిగే అవకాశముందని తెలుస్తోంది. తొలి విడత యాత్ర కేవలం జనసేనకు పట్టున్నప్రాంతాల్లోనే పర్యటించారన్న ప్రచారానికి చెక్ పెట్టడానికి రెండో విడత యాత్రను వెంటనే పవన్ ప్రారంభించినట్లు కనపడుతుంది. దీంతో పాటు కొన్ని సినిమా షూటింగ్ లు కూడా ఉండటంతో రెండో దఫా యాత్రను వీలయినంత త్వరగా పూర్తి చేసి, అగ్రిమెంట్ చేసిన సినిమాలను పూర్తి చేయాలన్న భావనలో పవన్ ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రెండో విడత యాత్రలో పవన్ ప్రసంగంలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. కేవలం ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం కాకుండా తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వనున్నారు.
Follow Us On : YouTube , Google News