నెదర్లాండ్స్ లో(Netherland)ప్రభుత్వం కుప్పకూలింది. దేశంలోకి వలసలను నియంత్రించే విధానంపై(Migration policy) సంకీర్ణ కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాన మంత్రి పదవికి మార్క్ రుట్టే(Mark Rutte)రాజీనామా చేయడంతో డచ్ ప్రభుత్వం కూలిపోయింది.తనతోపాటు మంత్రిమండలి కూడా రాజీనామా చేస్తున్నట్టు మార్క్ రుట్టే ప్రకటించారు. రుట్టే.. తన రాజీనామా లేఖను శనివారం నెదర్లాండ్స్ రాజు విల్లెమ్-అలెక్సాండర్కు అందజేశారు.
కాగా, రుట్టే.. నెదర్లాండ్స్లో ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి. 2010లో ఆయన తొలిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టారు. గతేడాది జనవరిలో ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన ఏడాదికే సంకీర్ణం ప్రభుత్వం కూలిపోవడం గమనార్హం. రుట్టే రాజీనామాతో పార్లమెంటులోని దిగువసభలో ఉన్న 150 సీట్లకు ఈ ఏడాది చివర్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.అయితే, విదేశీ శరణార్థులతో వలసల శిబిరాలు కిక్కిరిసిపోయిన విషయం గతేడాది వెలుగులోకి రావడం నెదర్లాండ్స్లో సంచలనానికి దారి తీసింది.
2022లో యూరప్ బయట నుంచి వచ్చిన 21,500 మంది ప్రజలు నెదర్లాండ్స్లో ఆశ్రయం పొందారు. దీంతో సమస్యకు నిర్మాణాత్మక పరిష్కారం చూపిస్తానని ఆ సమయంలో వీవీడీ పార్టీ నేత,ప్రధాని మార్క్ రుట్టే హామీ ఇచ్చారు. వలసల కట్టడి చర్యల్లో భాగంగా విదేశీ శరణార్థుల కుటుంబసభ్యులను దేశంలోకి అనుమతించడంపై పరిమితులు విధించే విషయంపై పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రుట్టే ప్రయత్నించి విఫలమయ్యారు. నెదర్లాండ్స్లోకి అనుమతించబడిన యుద్ధ శరణార్థుల బంధువుల సంఖ్యను నెలకు 200కి పరిమితం చేయాలని రుట్టే ప్రయత్నించారు.
అయితే సెంట్రల్ నెదర్లాండ్స్లోని బలమైన ప్రొటెస్టంట్ “బైబిల్ బెల్ట్” నుండి ప్రధాన మద్దతును పొందుతున్న క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ.. శరణార్థి కుటుంబ సభ్యుల సంఖ్యను పరిమితం చేసే ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకించింది.”వలస విధానంపై సంకీర్ణ భాగస్వాములకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయన్నది రహస్యం కాదు. నేడు, దురదృష్టవశాత్తూ ఆ విభేదాలు సరిదిద్దలేనివి అని మేము తీర్మానించవలసి ఉంటుంది” అని రుట్టే శుక్రవారం హేగ్లో విలేకరులతో అన్నారు.
Follow Us On : YouTube , Google News