పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. నేడు జరిగిన పోలింగ్ సందర్భంగా అనేక చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనలలో తొమ్మిది మంది వరకూ మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు పలుచోట్ల గాలిలోకి కాల్పులు జరిపారు. మృతి చెందిన వారిలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికలలో…
పంచాయతీ ఎన్నికలను అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ, కమ్యునిస్టు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీలలో ఆధిపత్యం కోసం ప్రయత్నించాయి. ఈ సందర్భంగానే హింస చెలరేగింది. పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఘర్షణలు కూడా మొదలయ్యాయి. అనేక చోట్ల పోలింగ్ కేంద్రాల్లోకి దూరి ఆందోళన కారులు బ్యాలట్ బాక్సులను ఎత్తుకెళ్లారు.
9 మంది మృతి…
కూచ్ బెహార్ లోని ఒక పోలింగ్ కేంద్రంలో ఆందోళనకారులు చొరబడి ధ్వంసం చేశారు. బ్యాలెట్ బాక్సులను వదిలి పోలింగ్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. రాణినగర్ లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. పోలీసు బలగాలు ఎంత ప్రయత్నించినా ఆందోళనకారుల స్వైరవిహారాన్ని అదుపు చేయలేకపోయారు. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 73,887 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. హింస కారణంగా పలుచోట్ల వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.