ఒకవైపు పంట దిగుబడి తగ్డడం, విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కూరలు కొనగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. గతంలో మార్కెట్ కెళితే రెండు వందల రూపాయలకు సంచి నిండిపోయేది. కానీ నేడు ఐదు వందలయినా సగం సంచి నిండుతుంది. ప్రధానంగా ప్రతిరోజూ వంటల వాడకంలో టమాటా, పచ్చిమిర్చి లేనిదే కుదరని పని. వంటింట్లో ఈ రెండు కూరగాయలు ప్రధానం. ఈ రెండు కూరగాయల ధరలే కొండెక్కాయి.
రైతు బజార్లలోనూ…
రైతు బజార్లలో రేట్లు ప్రస్తుతం టమాటా కిలో 140 రూపాయల నుంచి 160 రూపాయల వరకూ పలుకుతుంది. ఇక బయట మార్కెట్ లో అయితే 180 రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. మదనపల్లి మార్కెట్ లో ఆదివారం కొంత టమాటా ధర తగ్గినట్లు కనిపించినా సోమవారానికి మళ్లీ పెరిగాయి. ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు టమాటా ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు వినపడుతున్నాయి.
వర్షాల కారణంగా…
ఇదే పరిస్థితి కొనసాగితే టమాటా కిలో రెండు వందల రూపాయలకు చేరుకునే అవకాశముంది. ఉత్తర భారత దేశంలో ఇప్పటికే కూరగాయల ధరలు భారీ వర్షాల కారణంగా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. దాని ప్రభావం దక్షిణ భారత దేశానికి కూడా పాకింది. ఏపీ, తమిళనాడు వంటి ప్రభుత్వాలు కొంత సబ్సిడీపై టమాటాలు విక్రయిస్తున్నా అందరికీ అందడం లేదు. మిగిలిన కూరగాయల ధరలు కూడా రానున్న కాలంలో భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.