బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడో సారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని వ్యూహాలు పన్నుతున్నారు. గతంలో మాదిరి గ్రౌండ్ సాఫీగా లేదు. అయినా ఈసారి గెలిచేందుకు సర్వశక్తులూ ఆయన ఒడ్డుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడమే ఆయనకు కావాల్సింది. కానీ ప్రభుత్వ ఓటు చీలుతుందా? లేదా? అన్న అనుమానం గులాబీ బాస్ కంటిమీద కునుకు లేకుండా చే్స్తుంది. భారతీయ జనతా పార్టీ బలపడితే కొంత అడ్వాంటేజీ ఉంటుందని అంచనా వేసిన కేసీఆర్, కమలం పార్టీ రోజురోజుకూ తెలంగాణలో వెనకబడి పోతుండటంతో బీఆర్ఎస్ అధినేతలో ఆందోళన మొదలయింది. అందుకే ప్రత్యామ్నాయ చర్యలకు దిగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
రెండో స్థానం కోసం…
మొన్నటి వరకూ బీజేపీ, కాంగ్రెస్ లు తెలంగాణలో రెండో స్థానం కోసం పరుగులు తీస్తుండేవి. కానీ బీజేపీ హైకమాండ్ స్వయంకృతాపరాధంతో కాంగ్రెస్ కంటే వెనకబడి పోయిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించడంతో బీసీ వర్గంతో పాటు తెలంగాణలో అధికంగా ఉండే మున్నూరు కాపులు కూడా దూరమయ్యే అవకాశాలు కమలం పార్టీలో స్పష్టం కనిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా ఈ రెండు వర్గాలు హస్తం పార్టీ వైపు చూసే ఛాన్స్ లు ఉన్నాయన్న ఇంటిలిజెన్స్ నివేదికలు గులాబీ నేతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. బీజేపీలో ఆరు నెలల క్రితం వరకూ ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదన్నది వాస్తవం.
కాంగ్రెస్ లో మాత్రం…
కాంగ్రెస్ మాత్రం తెలంగాణలో ఫుల్ జోష్ లోనే ఉంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని తెలంగాణ ప్రజలు భావిస్తున్న పరిస్థితి నెలకొందని పలు సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే తప్పేంటి? అన్న భావన ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఇమేజ్ కేంద్ర స్థాయిలో పెరగడం, ఇక్కడి ప్రభుత్వ వ్యతిరేకత కూడా హస్తం పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని అనుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది నేతలు గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారు. రానున్న కాలంలో చేరికలు మరింత ఉంటాయని కూడా చెబుతున్నారు.
సరికొత్త వ్యూహంతో…
క్షేత్రస్థాయిలో నేతలు, ఓటు బ్యాంకు పరంగా బలంగా ఉన్న కాంగ్రెస్ కు అదనపు బలం సమకూర్చుకుంటున్న ఆశలు లీడర్లలో కనిపిస్తున్నాయి. అయతే నేతలు ఐక్యంగా ఉంటే చాలు గెలవడం పెద్ద కష్టం కాదన్న భావన కూడా నెలకొంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ధీమా మరింత పెరిగింది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ తో ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వామపక్ష పార్టీలను కూడా కలుపుకుని పోకుండా ఒంటరిగానే పోటీ చేస్తే కనీసం కొన్ని నియోజకవర్గాల్లోనైనా త్రిముఖ పోటీ ఎదుర్కొనే వీలుందని ఆయన ఆలోచనలు కొనసాగుతున్నాయంటున్నారు. మరి గులాబీ బాస్ ఏ రూట్ లో వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.