ఉత్తర భారతాన్ని వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఇరవై మంది వరకూ మరణించారు. పర్యాటకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్థంభించి పోయింది. కొండ చరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
యాభై ఏళ్లలో…
వాహనాలు నిలిచిపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలాన్ ప్రాంతంలో 135 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. గత యాభై ఏళ్లలో ఇదే రికార్డు స్థాయిల వర్షమని చెబుతున్నారు. బియాస్ నది ఉప్పొంగింది. దీంతో అనేక ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. సైన్యం అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించింది. ఉత్తరాఖండ్ లో అయితే పర్యాటకులకు చెందిన వాహనం నదిలో కొట్టుకుపోయింది. వెంటనే ఎన్.డి.ఆర్.ఎఫ్ బలగాలు కొందరిని రక్షించగలిగాయి. నలుగురు వాహనంలో చిక్కుకుపోయి మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో తెలుగు యువకుడు ఒకరు ఉన్నారని అధికారులు తెలిపారు.
ఢిల్లీలోనూ…
ఢిల్లీలోనూ నిన్న భారీ వర్షం నమోదయింది. గత నలభై ఏళ్లలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ స్థంభించింది. అనేక కార్లు నీట మునిగాయి. ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. ఒక్కసారిగా వర్షం కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ వర్షం భారీగా కురవడంతో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. పంట నష్టం కూడా ఎక్కువగానే ఉంది.