ఈ నెల 18వ తేదీన భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో సమావేశం కానుంది. ఈ సమావేశాలకు పాత స్నేహితులను పిలవాలని నిర్ణయించింది. 2024 లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమయ్యే చర్యల్లో భాగంగా పాత మిత్రులను కలుపుకుని పోవాలని భావిస్తుంది. గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలకు తిరిగి ఆహ్వానం పంపేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు వెళ్లాయి. మరోసారి కలసి పనిచేయడానికి తమతో చేతులు కలపాల్సిందిగా బీజేపీ మిత్రపక్షాలను కోరుతుంది. రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల నాటికి బలం పెంచుకోవడం కోసం, దేశంలో తమకు మద్దతిస్తున్న పక్షాల సంఖ్య ఇదీ అని తెలియజెప్పడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
మిత్రుల అవసరాన్ని…
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ అగ్రనాయకత్వం మిత్రపక్షాల అవసరాన్ని గుర్తించింది. గతంలో మాదిరి ఈసారి ఏకపక్షంగా సీట్లు రావన్న అంచనాకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా దేశంలో పెరిగినట్లు గుర్తించింది. అయితే తమను ఢీకొనే స్థాయిలో కాంగ్రెస్ పుంజుకోలేదన్న భావనలో ఉన్న బీజపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రాల వారీగా పాత మిత్రులను కలుపుకుని వెళ్లాలని మాత్రం డిసైడ్ అయింది. దీంతో ప్రజల్లో సానుకూల సంకేతాలు వెళతాయని గట్టిగా విశ్వసిస్తుంది. ముందుగానే మిత్రపక్షాలుగా చేర్చుకంటే ఎన్నికల అనంతరం మ్యాజిక్ ఫిగర్ కు కొన్ని సీట్లు తగ్గినా కలుపుకుని పోవచ్చన్న భావనలో ఉంది. అందుకే మిత్రపక్షాలతో భేటీకి రెడీ అయింది. గతంలో ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయాయి. వారందరినీ ఇప్పుడు అక్కున చేర్చుకోవాలని అనుకుంటోంది.
టీడీపీకి అందని…
అందులో భాగంగానే మిత్రపక్షాలకు బీజేపీ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. విపక్షాలకు మించి తాము బలంగా ఉన్నామని చెప్పేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ గతంలో మిత్రపక్షంగా ఉండేది. కేంద్రంలోనూ, రాష్ట్ర్రంలోనూ భాగస్వామ్యులుగా రెండు పార్టీలు ఉండేవి. కానీ 2018లో టీడీపీ ఎన్డీఏను వీడింది. అయితే తిరిగి బీజేపీతో జత కట్టేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచే చంద్రబాబు మోదీ సర్కార్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అమిత్ షాతో కలసి చర్చించి వచ్చారు కూడా. అయితే ఈ సమావేశానికి మాత్రం ఇంత వరకూ బీజేపీ నుంచి టీడీపీకి ఆహ్వానం అందలేదు. ఈ విషయం టీడీపీ అధికారికంగా ప్రకటించింది. ఒకవేళ ఆహ్వానం అందితే టీడీపీ నుంచి ప్రతినిధులు ఎవరైనా హాజరవుతారా? లేదా? అన్నది కూడా ఆసక్తికరంగానే మారింది.
జనసేనకు కూడా…
2019 ఎన్నికల తర్వాత బీజేపీతో జత కట్టిన జనసేనకు కూడా ఇన్విటేషన్ లేదు. సమావేశానికి ఇంకా పెద్దగా సమయం లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్నారు. ఆయన యాత్రలో ఉన్నప్పుడే ఢిల్లీలో సమావేశం జరగనుంది. యాత్రకు బ్రేక్ ఇచ్చి పవన్ వెళ్లే పరిస్థితి లేదు. అసలు ఇంత వరకూ జనసేనకు కూడా బీజేపీ నుంచి ఆహ్వానం అందలేదు. ఒకవేళ రమ్మని పిలుపొస్తే మాత్రం జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ హాజరయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. రాష్ట్రంలో పొత్తుల అంశం తేలకముందు సమావేశానికి హాజరయ్యే విషయంలోనూ జనసేన అగ్రనాయకత్వం కొంత ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఏపీ నుంచి మిత్రులు ఎవరికీ ఫోన్ రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.