భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నలభై ఐదు రోజుల్లో అసెంబ్లీ రద్దవుతుందని జోస్యం చెప్పారు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రూపులను ప్రోత్సహించవద్దని నేతలకు, ఐక్యంగా పనిచేయాలని కార్యకర్తలను ఆయన కోరారు. అప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
నేతలందరూ…
టిక్కెట్ రాకున్నా ఎవరూ నిరాశ చెందాల్సిన పనిలేదని, వారికి పార్టీ ప్రత్యామ్నాయ అవకాశాలను కల్పిస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్సీ ఇస్తారని, అందరూ కలసి పనిచేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ లో అనేక గ్రూపులున్నాయని, వాటిని కాంగ్రెస్ నేతలు అనుకూలంగా మార్చుకోవాలన్నారు. తాను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలసి పనిచేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా తాను అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు.