ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ లీడర్ల స్కూల్ లో మార్పు రాలేదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఏపీలోని పొలిటికల్ లీడర్లు మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇది వినడానికి ఏవగింపుగా ఉంటుంది. ప్రజలు కూడా వీటిని స్వాగతించడం లేదు. గత ఎన్నికల్లోనే ఈ విషయం స్పష్టమయింది. 2019 ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ లక్ష కోట్ల అవినీతి పరుడంటూ టీడీపీ మాటల దాడి చేసింది. అయినా ప్రజలు జగన్ కే పట్టం కట్టారు. తిడితే గుర్తింపు దక్కుతుందని భావించడం పాత సిలబస్. ఇప్పుడు జనం అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో కోరుకుంటున్నారు. విడిపోయిన రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టగలమో చెప్పాలి. డెవలెప్ మెంట్ కు సంబంధించి రూట్ మ్యాప్ పబ్లిక్ ముందుంచితే వాటిని స్వాగతిస్తారు తప్పించి ప్రత్యర్థిని తిట్టినంత మాత్రాన ఓట్లు వచ్చిపడవు.
సైకో అంటూ…
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారనుకోవాలి. జగన్ ను సైకో అంటూ ప్రతి సభలో ధ్వజమెత్తుతున్నారు. బాబాయిని చంపిన కేసులో జగన్ ఉన్నాడంటూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. చంద్రబాబు ఏ ప్రసంగంలోనైనా జగన్ ను తిట్టడం కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. అదీ మూసపద్ధతిలో ప్రసంగం సాగుతునట్లు అనిపిస్తుంది. వైసీపీ నేతల అవినీతి అంటూ ఆరోపణలు చేయడం తప్పించి అందుకు తగిన ఆధారాలను ఆయన చెప్పడం లేదు. 151 సీట్లతో అధికార పీఠాన్ని అధిరోహించిన జగన్ ను సైకో అంటూ సంబోధించడం కూడా కొంత వెగటుగా అనిపిస్తుంది. జనం మాత్రం వీటిని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు.
పోలింగ్ కేంద్రం వరకూ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అంతే. ఆయన సినిమాలలో డైలాగులకు విజిల్స్ వినిపించవచ్చు. సభల్లో కూడా అంతే. కానీ ఆ విజిల్స్ పోలింగ్ కేంద్రాల వరకూ చేరతాయన్న నమ్మకం మాత్రం లేదు. జగన్ ను విమర్శించడం తప్ప పవన్ కల్యాణ్ కు వేరే పనిలేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆయన ప్రసంగంలోనూ సింహభాగం జగన్ ను తిట్టడానికే కేటాయిస్తుండటం ఆయన ఫ్యాన్స్ కు నచ్చుతుందేమో కానీ, వాస్తవ ఓటర్ల చెవికి మాత్రం ఎక్కడం లేదు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పాల్సింది పోయి.. ఈ ప్రభుత్వం దిగిపోవాలని.. ఇదే నా శాసనసమంటూ శాపనార్థాలు పెట్టడం కూడా జనాలకు నచ్చడం లేదు.
చప్పగా సాగుతూ…
ముఖ్యమంత్రి జగన్ కూడా వీరిద్దరికీ ఏమాత్రం తీసిపోవడం లేదు. దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు అంటూ వేసిన రికార్డులను వేస్తూ చెవుల్లో మోత పుట్టిస్తున్నారు. జగన్ ప్రసంగం గత కొన్ని నెలలుగా ఒకే రీతిలో కొనసాగుతుంది. ఆయన స్పీచ్ లలో మార్పులేదు. చప్పగా సాగుతుంది. పవన్ కల్యాణ్ – పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగత విమర్శలు కూడా ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్నారు. చంద్రబాబును ముసిలాయన అంటూ సంభోదించడం కూడా ప్రజలకు రుచించడం లేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ లోని నేతలందరూ ప్రత్యర్థులను తిడితే జనం తమ వైపునకు తిరుగుతారన్న అపోహలో మాత్రమే ఉన్నారు. కానీ అది వారికి మైనస్ గా మారుతుందని మాత్రం గుర్తించడం లేదు. సో.. లీడర్లూ… మీ సిలబస్ మార్చుకుంటే బెటర్.