ప్రకాశం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మృతుల్లో చిన్నారి ఒకరు ఉన్నారు. పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి సాగర్ కాల్వలో పడటంతో ఆ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు అప్రమత్తమై బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
వివాహ వేడుకకు…
ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు కాకినాడలోని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు పొదిలి నుంచి బయలుదేరారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ బస్సు బయలుదేరింది. కాకినాడ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నారు. అయితే దర్శి కి చేరుకునే సరికి ఈ బస్సు అదుపుతప్పి సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలను ప ప్రారంభించారు. మృతదేహాలను వెలికి తీసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
కుటుంబాల్లో విషాదం…
మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక వృద్ధుడు, చిన్నారి ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే కాల్వలో నీరు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెబుతున్నారు. వివాహ వేడుకకు బయలుదేరిన వారు మృత్యువాత పడటం వారి కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం దిగ్భ్రాంతి…
ప్రమాదం జరిగిన వెంటనే కొందరు గ్లాస్ లు పగలు కొట్టుకుని బయటకు రావడంతో చాలా మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శి బస్సు ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు అండగా నిలవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.