భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ. మోదీ బొమ్మతోనే మరొకసారి కమలం పార్టీ 2024 ఎన్నికలకు వెళ్లనుంది. అలా అయితేనే గెలుపు సాధ్యమవుతుందని బీజేపీ భావిస్తుంది. బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ లు కూడా అవే రకమైన భావనలో ఉన్నాయి. హ్యాట్రిక్ కొట్టాలంటే ఈ ఎన్నికల్లో మోదీ చరిష్మాను వాడుకోవాలన్న ఆలోచన నుంచి కమలం పార్టీ బయటకు రాదు. రాబోదు. ఇది వాస్తవం. కానీ మోదీని ఎదుర్కొనే నేత ఎవరు? విపక్షాలలో అంతటి నేత ఉన్నారా? క్లీన్ ఇమేజ్ తో పాటు చరిష్మా ఉన్న నేత అవసరం. అప్పుడే మోదీ హవాకు బ్రేక్ పెట్టొచ్చు. కానీ విపక్షాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తారా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రాహుల్ క్రేజ్…
విపక్షాల్లో చరిష్మా ఉన్న నేతలే ఉన్నారు. రాహుల్ గాంధీ గతంలో మాదిరి లేరు. ఆయన క్రేజ్ పెరిగింది. భారత్ జోడో యాత్ర తర్వాత ఆయనలో పరిణితి కనిపిస్తుంది. దేశం పట్ల అవగాహన, ప్రజా సమస్యల పట్ల రాహుల్ స్పందించే తీరు కూడా మన్ననలను అందుకుంటున్నాయి. మోదీకి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీయా? అన్నది ఇంకా తేలకున్నా “మంచి లీడర్” అని మాత్రం అనిపించుకోగలిగారు. ప్రధానంగా గత మూడేళ్ల నుంచి ఆయనలో సమూలమైన మార్పు వచ్చింది. సీనియర్లను తోసిరాజని తన సొంత టీంతో ఆయన ముందుకు వెళుతుండటం కూడా కలసి వచ్చింది. ప్రజలతో రాహుల్ మమేకమయ్యే తీరు కూడా ఆకట్టుకుంటుంది. రాహుల్ గోల్డెన్ స్పూన్ తో పుట్టారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రధాని పదవి రెడీగా ఉంది. కానీ ఆయన దాని జోలికి వెళ్లలేదు. అది కూడా ఇప్పుడు రాహుల్ కు ప్లస్ పాయింట్ గా మారనుంది.
క్లీన్ ఇమేజ్…
రాహుల్ ఏమీ తెలియని అమాయకపు యువకుడిగా మొన్నటి వరకూ జనాలకు కన్పించారు. ఆయన చేతిలో దేశాన్ని పెడితే భారత్ భవిష్యత్ ఏమైపోతుందన్న ఆందోళన కూడా అధికంగానే వినిపించింది. కనిపించింది. కానీ ఇప్పుడు రివర్స్ అయింది.క్లీన్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చేస్తున్న ప్రసంగాలు, వ్యవహారశైలి ఆయనలో ఒక నాయకుడున్నాడని చెప్పకనే చెప్పింది. తల్లి చాటు బిడ్డలాగా కాకుండా స్వతంత్రంగా ఆలోచించగలిగన నేతగా రాహుల్ ఎదిగాడన్నది కూడా జాతీయ స్థాయిలో విశ్లేషకులు సయితం వివిధ సందర్భాల్లో అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి వెళితే బాగుంటుందన్న సూచనలు కూడా వినిపిస్తున్నాయి.
మరికొందరి పేర్లు…
అయితే ఇందుకు రాహుల్ అంగీకరించకపోవచ్చు. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవినే వద్దనుకున్నారు. ప్రధాని పదవిని తీసుకోవడానికి ఆయన అంగీకరించే అవకాశాలు లేవన్నది కూడా సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. ఈ పరిస్థితుల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా విపక్ష కూటమిలో చర్చ జరుగుతుంది. నితీష్ అయితే అందరికీ ఆమోద్యయోగ్యమైన వ్యక్తిగా ఉన్నారు. మమత బెనర్జీ వంటి వారి పేర్లు పరిశీలనలోనే లేదంటున్నారు. ఫైర్ బ్రాండ్ వంటి నేతల పేర్లను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే అసలుకే మోసం వస్తుందని, అది బీజేపీకి లాభం చేకూరుస్తుందని ఆమె పేరు పెద్దగా వినిపించడం లేదు. రాహుల్, నితీష్ లు మాత్రమే ఇప్పుడు మోదీకి ధీటైన నేతలుగా భావిస్తున్నారు. మరి ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటిస్తారా? లేదా ఎన్నికల అనంతరం నిర్ణయిస్తారా? అన్నది కూడా తేలాల్సి ఉంది.