తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లకు చేరుకుంది. ఆయన 153రోజుల నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. కుప్పంలో ప్రారంభమైన యాత్ర రాయలసీమలోని అన్ని జిల్లాలను ముగించుకుని ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని లోకేష్ దాటారు.
కావలి నియోజకవర్గంలో…
కావలి నియోజకవర్గం సిరిపురం నుంచి నేటి యాత్ర ప్రారంభించిన లోకేష్ కొద్దిసేపటిక్రితం రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. కొత్తపల్లి సమీపంలో యువగళం రెండు వేలకు చేరుకోవడంతో అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొత్తపల్లి గ్రామస్థులతో లోకేష్ మాటా మంతీ కలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు వచ్చే ఎన్నికల్లో అండగా నిలిస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నేడు ఉదయగిరిలో…
మధ్యాహ్నం ఆర్ సి పాలెం వద్ద లోకేష్ భోజన విరామానికి ఆగుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి యాత్ర ప్రారంభమవుతుంది. రాజువారి చింతపాలెం మీదుగా నేడు యువగళం పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చోడవరం శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు. రోజుకు పదమూడు కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తున్న లోకేష్ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు.