జనసేన అధినేత పవన్ కల్యాణ్ మిత్రపక్షాలకు ఇబ్బందికరంగా మారతారా? అధికార వైసీపీకి ప్రయోజనం చేకూరేలా పరోక్షంగా పాటు పడుతున్నారా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. సున్నితమైన విషయాలను కూడా పవన్ ప్రస్తావిస్తూ పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారారు. వారాహి యాత్రలో పవన్ చేస్తున్న ప్రసంగాలకు క్లాప్స్ అయితే వస్తున్నాయి కానీ మిత్రపక్షంగా భావిస్తున్న టీడీపీ నుంచి మాత్రం సానుకూలత రావడం లేదు. వైసీపీకి తానే అస్త్రాలను అందిస్తున్నాడు. అసలు విషయం మరుగున పడి పోయి, కొసరు విషయాలు హైలెట్ కావడానికి పవన్ చేస్తున్న కామెంట్స్ కారణమని చెప్పకతప్పదు.
వాలంటీర్ల మీద…
వారాహి యాత్రలో వాలంటీర్ల మీద పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అవినీతి పక్కదారి పట్టి వాలంటీర్ల విషయమే హైలెట్ అయింది. వాలంటీర్లు మహిళల మిస్సింగ్ కు పరోక్షంగా కారణమని చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దీంతో రెండు రోజులుగా ఏపీలో వాలంటీర్ల ఆందోళన, పవన్ దిష్టిబొమ్మల దహనం, ఖండనలతోనే కాలం గడచిపోతుంది. అందుకే పవన్ ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. వాలంటీర్ల వ్యవస్థ ను తాము అధికారంలోకి వస్తే ఉంచబోమని పరోక్షంగా పవన్ చెబుతున్నట్లుగా ఉంది. ఈ కారణంతో లక్షలాది ఓట్లు ఫ్యాన్ గుర్తుపై బలంగా పడతాయన్నది మాత్రం పవన్ గుర్తెరగడం లేదు.
టీడీపీ నేతలు కూడా…
గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ల మీద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత వెనక్కు తీసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తొలగించబోమని కూడా ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పవన్ ది వివరణ ఇచ్చుకునే మనస్తత్వం కాదు. వెనక్కు తీసుకునే తత్వం కూడా కాదు. ఆయన తాను అనుకున్న ప్రకారం మాత్రమే ముందుకు వెళతాడు. ఇది టీడీపీ నేతలకు కూడా ఇబ్బందికరంగా మారింది. వాలంటీర్ల వ్యవస్థను కించపర్చడమే కాకుండా దానిని సమర్థించుకోవడం కూడా కొందరు టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. వారాహి యాత్ర మొత్తం కాంట్రవర్సీలతోనే సాగుతుంది. వివాదాలు మీడియాలో హైలెట్ కావచ్చు కాని, రాజకీయంగా అది పవన్ కు గాని, ఆయనతో పొత్తు పెట్టుకున్న వారికి గాని ఉపయోగపడదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
అన్నిపనులూ…
వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత పింఛను దగ్గర నుంచి రేషన్ కార్డు వరకూ ఆఫీసుల చుట్టూ తిరగే శ్రమ తప్పింది. ఇది ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్. పనికి వెళ్లకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాలంటీర్లు తమ పనులను సులువుగా చేసి పెడుతున్నారన్నది కూడా వాస్తవం. వాలంటీర్లలో 60 శాతం మంది మహిళలే ఉన్నారు. అలాగే ప్రతి ఇంటికి వెళ్లి డేటా సేకరించి దానిని ఇతరులకు ఇస్తున్నారని పవన్ చేసిన కామెంట్స్ ను కూడా తప్పు పడుతున్నారు. తమ డేటా వల్ల ఎవరికి ఉపయోగం? అని ప్రశ్నిస్తున్నారు. తమ డేటా తీసుకుని ఎవరు ఏం చేయగలరని వారు అంటున్నారు. పంచాయతీ సిబ్బందిని ఎందుకు ఉపయోగించుకోరు? అన్న ప్రశ్నకు ప్రభుత్వ ఉద్యోగులకు, వాలంటీర్లకు మధ్య తేడా తెలుసుకుంటే మంచిదన్న సూచనలు కూడా వినిపిస్తున్నాయి.
అసలుకే మోసమా?
పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్ గా ఉపయోగపడతారని చంద్రబాబు నుంచి టీడీపీ నేతలు భావించారు. కాపు సామాజికవర్గం ఓట్లతో పాటు యువత, ఆయన అభిమానుల ఓట్లు తమకు అనుకూలంగా మారతాయని లెక్కలు వేసుకున్నారు. కానీ పవన్ అనాలోచిత వ్యాఖ్యలు కారణంగా కొన్నివర్గాలు దూరమవుతాయని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. పవన్ తో పొత్తు పెట్టుకుంటే గెలుపు మాట అటుంచి అసలుకే ఎసరు వస్తుందన్న నేతలు కూడా ఉన్నారు. రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. సున్నితమైన అంశాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. హాజరైన జనాన్నిచూసి రెచ్చిపోతే మాత్రం అది చివకు బూమ్ రాంగ్ అవుతుంది. అందుకే పవన్ ఇప్పటికైనా ఏదైనా ఆరోపణలు చేసేముందు జరగబోయే పరిణామాలను తెలుసుకుని మాట్లాడితే మంచిది. బి అవేర్ పవన్.