ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న భారత వాతావరణ శాఖ సూచన మేరకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్ర్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. మొత్తం ఆరు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రెడ్ అలర్ట్…
పంజాబ్ లో ఈ నెల 13వ తేదీ వరకూ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆస్తి నష్టం కోట్లలోనే ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో అంచనాలు వేయడం కష్టంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నది, ఢిల్లీలో యమున నది ఉగ్రరూపం దాల్చింది. గత యాభై ఏళ్లలో ఇలాంటి వర్షాలు తాము చూడలేదని స్థానికులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో అయితే అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. అధికార యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటుంది.