టామాటాలు ఇప్పుడు బంగారంలా మారిపోయాయి. కిలో టమాటా 120 రూపాయల వరకూ పలుకుతుంది. బయట మార్కెట్ లో మరో నలభై రూపాయలు ఎక్కువగానే ఉంది. టమాటాకు డిమాండ్ కూడా ఎక్కువే. టమాటాలను కాపాడుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. మొన్నామధ్య ఒక రైతు టమాటా కు బౌన్సర్లనే కాపలాగా పెట్టుకున్న ఘటన వైరల్ అయింది. తాజాగా రెండున్న టన్నులున్నటమాటా ట్రక్కును దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కర్ణాటకలో జరిగింది.
యాక్సిడెంట్ కావడంతో…
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ కు చెందిన రైతు ఒకరు తన పొలంలో పండిన టమాటాలను కోలార్ మార్కెట్ కు తీసుకెళుతున్నారు. దాదాపు 2.5 టన్నుల ఈ టమాటాల లోడు వ్యాన్ బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ట్రక్కు ఒక కారును ఢీకొట్టింది. ఆ కారులో ఉన్న యువకులు తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. అయితే తమ వద్ద వారు అడిగినంత డబ్బు లేదని చెప్పడంతో టమాటా లతో ఉన్న ట్రక్కుతో యువకులు పరారయ్యారు. వీటిఖరీదు మూడు లక్షల రూపాయల వరకూ ఉంటుందని రైతు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.