వాలంటరీ వ్యవస్థపై భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటరీ వ్యవస్థ అత్యంత ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. యాభై కుటుంబాల సమాచారం వారి చేతుల్లో ఉండటం క్షేమం కాదని కూడా సోము వీర్రాజు అన్నారు. ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించి వైసీపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను తెచ్చిందన్నారు. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఈ వ్యవస్థను వాడుకునే అవకాశముందని ఆయన అన్నారు.
రాజకీయ కోణంలోనే…
వాలంటరీ వ్యవస్థను వెంటనే రద్దు చేయడం మంచిదని కూడా సోము వీర్రాజు అన్నారు. కేవలం సేవలను అందించడానికే ఈ వ్యవస్థను రాజకీయ కోణంలో ఏర్పాటు చేశారన్న సోము వీర్రాజు మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికే దీనిని ఏర్పాటు చేసిందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా గత రెండు రోజులుగా వాలంటరీ వ్యవస్థపై కామెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ వద్ద సమాచారం ఉంటే ఆధారాలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సోము వీర్రాజు తెలిపారు.