జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వాలంటీర్లు బహిరంగ లేఖ రాశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వారు లేఖలో కోరారు. మహిళల అక్రమ రవాణా వాలంటీర్లు చే్స్తున్నారా? అని లేఖలో ప్రశ్నించారు. ప్రతి నెల తాము ఒకటో తారీఖున ఠంచనుగా పింఛను అందిస్తున్నామని, సూర్యుడు ఉదయించకముందే వారికి పింఛను మొత్తం చేరవేయడం తాము చేసిన నేరమా? అంటూ పవన్ ను వాలంటీర్లు ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు చేరుస్తుంది తాము కాదా? అని నిలదీశారు.
మృతదేహాలను…
కరోనా సమయంలోనూ తాము ప్రాణాలకు తెగించి అనేక మందిని కాపాడిన మాట వాస్తవం కాదా? అని లేఖలో కోరారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను దగ్గరి బంధువులు కూడా వదిలేసి వెళితే తాము దహన సంస్కారాలు చేసింది నిజం కాదా? అని పవన్ ను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న వాలంటీర్ల వ్యవస్థను కేరళ రాష్ట్రంతో పాటు బ్రిటన్ వంటి దేశాలు కూడా అథ్యయనం చేశాయన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. దేశ ప్రధాని వాలంటీర్ల వ్యవస్థ బాగుందన్న ప్రశంసలు మీకు వినపడలేదా? అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవస్థ అంటేనే వెన్నులో వణుకుపుట్టి లేని పోని నిందలు వేస్తున్నారని, ఇది తగదని వాలంటీర్లు తాము రాసిన బహిరంగ లేఖలో కోరారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.