రాజకీయ నేతలు నోరును కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఏది మాట్లాడుతున్నామో స్పృహ ఉండాలి. సున్నితమైన అంశాల విషయంలో అగ్రనేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది కాంట్రవర్సీగా మారుతుంది. అసలే సోషల్ మీడియా కాలం. ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు చూపిస్తూ…వినిపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటారు. అనాలోచితంగా నైనా ఆచితూచి ఏ విషయంపైనైనా స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే అభాసుపాలు కాక తప్పదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయంగా హీటెక్కడం నేతల కామెంట్స్ కారణంగానే. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ ఆందోళనలకు దిగుతుండటం విశేషం. దీనినే సెల్ఫ్ గోల్ అంటారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.
అమెరికాలో…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. తానా సభల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ తానా ప్రతినిదులు సన్మానాలు కూడా చేశారు. అయితే ఇంటరాక్ట్ సెషన్ లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీనే ఇబ్బందుల్లో పడేశాయి. రైతులకు ఉచిత విద్యుత్తు మూడు గంటలు చాలు అని రేవంత్ అనడం సంచలనంగా మారింది. సమయం కోసం కాచుక్కూర్చున్న అధికార బీఆర్ఎస్ పార్టీ వెంటనే పాయింట్ ను క్యాచ్ చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఎత్తివేస్తారంటూ పెద్దయెత్తున ప్రచారం ప్రారంభించింది. 24గంటల నాణ్యమైన విద్యుత్తును అందించే తమ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ కు ఓటు వేయడం సరికాదంటూ రోడ్డెక్కింది.
ఉచిత విద్యుత్తు…
నిజానికి ఉచిత విద్యుత్తు ఇచ్చింది కాంగ్రెస్. వరంగల్ లో రాహుల్ గాంధీ సమక్షంలో విడుదల చేసిన రైతు మ్యానిఫేస్టోలోనూ దీని ప్రస్తావన లేదు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో అమలుచేసిన ఉచిత విద్యుత్తును ఎత్తివేసే ధైర్యాన్ని ఏ ప్రభుత్వమూ చేయలేదు. అలాంటిది కాంగ్రెస్ చేస్తుందంటే ఎలా నమ్మాలి? అంటున్నారు ఆ పార్టీ నేతలు. నాణ్యమైన విద్యుత్తు మూడు గంటలు నిరాటంకంగా ఇస్తే మూడు ఎకరాల భూమి తడుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారని, ఆయన మాటలను వక్రీకరించి బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటలు ఉచిత విద్యుత్తు ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విద్యుత్తు దుమారంతో కాంగ్రెస్ ఒకింత డిఫెన్స్ లో పడిందనే చెప్పాలి. అమెరికాలో ఆయన ఏం కామెంట్స్ చేశారో తెలియదు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీఆర్ఎస్ దానిని అందిపుచ్చుకుని ఆందోళనలకు దిగింది. రైతుల్లో అయోమయం నెలకొంది.
వాలంటీర్ల విషయంలోనూ…
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వాలంటీర్ల మీద చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా ఉన్నాయి. అధికార పార్టీకి పవన్ కామెంట్స్ ఒక వరంగా మారాయి. పవన్, చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తారన్న ప్రచారాన్ని వైసీపీ జనంలోకి తీసుకెళ్లగలిగింది. దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి సేవ చేస్తుంటే వాటిని కాదని లేనిపోని అభాండాలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మూడు రోజుల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. వారాహి యాత్రలో పవన్ మాట్లాడే మిగిలిన అంశాలకన్నా వాలంటీర్ల ఇష్యూ హైలెట్ అయింది. వాలంటీర్ల ఆందోళన వెనక అధికార పార్టీ ఉందన్నది కూడా వాస్తవం. ఇలా ఒక అంశాన్ని ప్రస్తావించే ముందు ఆచితూచి మాట్లాడటం రాజకీయ నేతలకు.. అందునా పార్టీ చీఫ్ లు అలవర్చుకోవాలి.లేకుంటే తాము మాత్రమే కాకుండా ఎన్నికల వేళ పార్టీ కూడా డ్యామేజీ అయ్యే అవకాశాలు లేకపోలేదు.