తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వరం మారింది. బీజేపీతో పొత్తు విషయంపై ఆయన పునరాలోచనలో పడినట్లు కనిపిస్తుంది. ఈరోజు జరిగిన మీడియా చిట్ చాట్ లో ఆయన అన్యాపదేశంగా అన్నా బీజేపీతో పొత్తు విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు కోసం ఇన్నాళ్లు ఎదురు చూసిన చంద్రబాబు ఇప్పుడు కమలం పార్టీ చేతులు కలపకపోయినా పరవాలేదనే ధోరణితో ఉన్నట్లు కనిపించారు. దీనిపై మీడియా మిత్రులే కొంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈక్వేషన్లు కూడా మారేటట్లు కనిపిస్తున్నాయి. జనసేనతో కలసి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నట్లు కనపడుతుంది.
మొన్నటి వరకూ…
అమిత్ షాతో భేటీలో ఏం జరిగిందో బయటకు రాలేదు.. కానీ బీజేపీతో పొత్తు ఉంటే బాగుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు మొన్నటి వరకూ భావించారు. అయితే ఈరోజు మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఆయన స్పందన చూస్తే చంద్రబాబు ఆలోచనల్లో మార్పు వచ్చిందనే అనుకోవచ్చు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ “ఎవరెవరో మాట్లాడిన వాటిపై స్పందించి చులకన కాదల్చుకోలేదు” అని ఆయన మీడియాతో అన్నారు. దగా పడిన ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమన్న చంద్రబాబు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సెట్ చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. పోరాడితే కేంద్రం దిగి వస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ అని కూడా ఆయన పేర్కొన్నారు.
వెనక్కు తగ్గారా?
అంటే పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. బీజేపీ గ్రాఫ్ దేశంలో పడిపోతుండటంతో ఆ పార్టీతో పొత్తు ఎందుకని చంద్రబాబు డిసైడ్ అయ్యారా? అన్న అనుమానం తలెత్తుతోంది. చంద్రబాబు కామెంట్స్ ను బట్టి చూస్తే జగన్ కేంద్రంపై కనీసం పోరాటం చేయలేదని కూడా అన్నారు. ఓట్ల నమోదులో జరిగిన అవకతవకలపై ఢిల్లీనికి కూడా వదిలిపెట్టబోమని చంద్రబాబు అనడం కూడా హస్తినపై పోరాటం తప్పదన్న హెచ్చరిక కూడా దాగుందన్న భావన కలుగుతుంది. బీజేపీతో పొత్తు వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారుతుందన్న సర్వే నివేదికలతో చంద్రబాబు వెనక్కు తగ్గారన్న వాదన కూడా వినిపిస్తుంది.
చిన్నమ్మ నియామకం…
అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు ను తొలగించి, పురంద్రీశ్వరి నియామకం పట్ల కూడా చంద్రబాబు అయిష్టంగానే ఉన్నట్లు కనపడుతుంది. టీడీపీ ఓట్లు చీల్చడానికి, జగన్ కు లోపాయికారీగా ఉపయోగపడేందుకు పురంద్రేశ్వరిని పార్టీ నియమించిందని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. దీంతో పాటు ఎక్కువ పార్లమెంటు స్థానాలను కూడా అడిగే అవకాశముండటంతో తాను బీజేపీ వెనక పడకూడదని టీడీపీ అధినేత డిసైడ్ అయిన తర్వాతనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. పార్టీ సీనియర్ నేతలు సయితం బీజేపీకి దూరంగా ఉంటే మేలని సూచించడంతో ఆయన స్వరంలో మార్పు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యగా ఉండవచ్చు తప్పించి, ముందుగానే పొత్తు పెట్టుకోవడం మంచిది కాదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారన్నది ఆయన కామెంట్స్ ను బట్టి అర్థమవుతుంది. మరి చివరి నిమిషంలో ఏం జరుగుతుందనేది చూడాలి.