ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సంక్షేమ పథకాలే తనను మరోసారి గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. అరవై శాతం మంది ప్రజలు తన వైపు మాత్రమే ఉన్నారని ఆయన విశ్వాసం. అంతేకాదు పట్టణ ప్రాంతాల్లో పార్టీకి కొన్ని ఇబ్బందులున్నా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ గతంలో కంటే స్ట్రాంగ్ గా ఉందన్నది జగన్ కు అందుతున్న నివేదికలను బట్టి తెలుస్తుంది. పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ ఎక్కువగా జరుగుతుంది. పేద ప్రజలే పోలింగ్ కు కూడా హాజరవుతారు. ఆ నమ్మకంతోనే జగన్ ఈసారి ఎన్నికల్లో వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఎమ్మెల్యేలపై అసంతృప్తి…
అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై కొంత అసంతృప్తి ఉందన్న విషయాన్ని సర్వేల ద్వారా గ్రహించిన జగన్ నష్ట నివారణకు నడుంబిగించారు. దాదాపు ముప్ఫయి నుంచి నలభై మంది వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు దక్కే ఛాన్స్ లేదు. అలాగే కొందరు ఎమ్మెల్యేలను పార్లమెంటుకు, పార్లమెంటు సభ్యులను శాసనసభకు తీసుకురావాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరి పేర్లను ఫైనలైజ్ చేశారంటున్నారు. వారికి పరోక్షంగా సమాచారం కూడా అందించారని చెబుతున్నారు. ఏ టిక్కెట్ దక్కని వారికి ఎమ్మెల్సీనో, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవో, నామినేటెడ్ పదవో ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.
కుమారుల పేర్లను…
దీంతో పాటు కొందరు నేతల స్థానంలో ఇప్పటికే వారి కుమారులకు టిక్కెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా జగన్ పరిశీలిస్తున్నారని సమాచారం. తండ్రి కంటే కుమారుడు బెటర్ అని భావిస్తేనే టిక్కెట్ ఇస్తారు. లేదంటే తండ్రికే మరోసారి అవకాశమివ్వాలన్నది జగన్ ఆలోచన. ఉదాహరణకు పేర్నినాని తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేశారు. తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి పోటీ చేసే అవకాశముందని కూడా చెప్పారు. కానీ నాని విషయంలో జగన్ ఒప్పుకోవడం లేదు. ఈసారికి నానినే పోటీ చేయించాలన్నది జగన్ భావన. అందుకు నాని ఒప్పుకుంటే సరి. లేదంటే ఆయన తన కుమారుడిని గెలిపించుకుని వచ్చే బాధ్యతను అప్పగిస్తారని వినికిడి.
అలా కాకుంటే…
అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని ఈసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించనున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చాలా రోజుల నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇదివరకే స్పష్టం చేశారు. గత ఎన్నికలలోనూ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి తన కుమారుడు అభినయ్ రెడ్డిని లైన్ లో పెట్టారు. ఆయనకు టిక్కెట్ ఇస్తారా? లేదా?అన్నది సస్సెన్స్. అభినయరెడ్డి ఇప్పటికే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆయనను బరిలోకి దింపుతారా? లేదా? సామాజికవర్గం కోణంలో వేరే నేతను ఎంపిక చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. మంత్రి,సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కూమారుడు రామమనోహర్ నాయుడుకు టిక్కెట్ ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ ఈసారి మాత్రం సీనియర్లను పక్కన పెట్టి వారి కుమారులకు అవకాశం ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నారంటున్నారు.