ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీ అతలాకుతలమవుతుంది. పై నుంచి వచ్చే నీటితో నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. ఢిల్లీలో యమున నది స్థాయికి మించి పారడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆస్తి నష్టం కూడా ఎక్కువగానే జరిగింది.
రహదారులు…
ఢిల్లీలో రహదారులయితే కాల్వలను తలపిస్తున్నాయి. రాజ్ ఘాట్ తో పాటు సెక్రటేరియట్ వద్ద కూడా నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతుకు పైగానే వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. యమునా నది నీటిమట్టం 208 మీటర్లను దాటడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. హర్యానా నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో యమునా నది ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.
డేంజర్ జోన్ లో…
స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించిన ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతి గంటకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. డేంజర్ లో ఉండే ప్రాంతాల నుంచి ప్రజలను అప్రమత్తం చేసి వారిని అక్కడి నుంచి తరలించేలా ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కూడా తమకు సహకరించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. విపత్తుల నిర్వహణ బృందంతో పాటు మున్సిపల్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం 144వ సెక్షన్ విధించింది.