యశస్వి జైశ్వాల్ … టీం ఇండియాకు ఒక చక్కటి బ్యాటర్ దొరికాడు. ఐపీఎల్ 2023 లో అదరగొట్టిన యశస్విని వెంటనే బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు ఎంపిక చేసింది. వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లకు యశస్వి జైశ్వాల్ ఎంపిక కావడంతో విదేశీ గడ్డ మీద సక్సెస్ అవుతాడా? లేదా? అన్న అనుమానాలు అందరిలోనూ తలెత్తాయి. కానీ అందరి సందేహాలను యశస్వి పటాపంచలు చేసేశాడు. అరంగేట్రం చేసిన తొలి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ బాది క్రీడా నిపుణుల ప్రశంసలను అందుకున్నాడు.
తొలి సెంచరీతో…
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో యశస్వి జైశ్వాల్ 143 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. రోహిత్ శర్మతో కలసి యశస్వి తొలి వికెట్ కు 229 పరుగులు జోడించాడు. దీంతో యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అరంగేట్రం చేసిన తొలి టెస్ట్ లోనే సెంచరీ చేసిన మూడో ఓపెనర్ గా యశస్వి రికార్డు సృష్టించాడు. యశస్వి ఆటతీరును మాజీ క్రికెటర్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మంచి భవిష్యత్ ఉందని చెబుతున్నారు.
రికార్డుల రారాజు…
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఈ పేదింటి కుర్రాడు క్రికెట్ పిచ్చితో ముంబయి చేరుకుని చివరకు పానీపూరీ కూడా అమ్మాడు. తాను అనుకున్నది సాధించాలనుకున్నయశస్వి కోచ్ కంటపడటంతో అతడి దశ తిరిగింది. అండర్ 16, అండర్ 19లో కూడా అబ్బురపర్చేలా ఆట ఆడాడు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్ గా దిగిన యశస్వి గత ఐపీఎల్ సీజన్ లో వీరబాదుడు బాదాడు. దీంతో యశస్వి పై సెలెక్టర్లకు నమ్మకం పెరిగింది. అతను కొట్టే షాట్లు పర్ ఫెక్ట్ గా ఉండటం, కాన్శిడెన్స్ అతడిని అంతర్జాతీయ మ్యాచ్ లకు ఎంపిక చేసింది. చిన్న వయసులోనే రికార్డులను క్రియేట్ చేస్తున్న యశస్వి మరిన్ని విజయాలను సాధిస్తాడని ఆశిద్దాం.