ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. వంగవీటి రంగా నుంచి రాధా వరకూ విజయవాడ రాజకీయాల నుంచి వంగవీటి కుటుంబాన్ని వేరు చేసి చూడలేం. రంగా హత్య తర్వాత ఆయన సతీమణి రత్నకుమారి కూడా రాజకీయాల్లో రాణించారు. అనంతరం రంగా కుమారుడు రాధా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అయ్యారు. అయితే తరచూ పార్టీలు మారడంతో ఆయన రాజకీయ జీవితం ఎటు వైపు వెళుతుందో తెలియని పరిస్థితి. కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ అంటూ దాదాపు అన్ని పార్టీల గడపలను ఆయన తొక్కి వచ్చారు. ఒక్క కాంగ్రెస్ పార్టీలో మినహాయించి మరెక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు.
టీడీపీలో ఉండి…
ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలో ఉన్నారు. వంగవీటి కుటుంబానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పట్టుంది. అక్కడ కాపు సామాజికవర్గంతో పాటు రంగా అభిమానులు ఎక్కువగా ఉండటం ఆ ఫ్యామిలీకి కలసి వచ్చే అంశం. అయితే టీడీపీలో ఆయనకు విజయవాడ సెంట్రల్ సీటు దక్కే అవకాశాలు లేవు. టీడీపీలో బలమైన నేత బొండా ఉమామహేశ్వరరావు అక్కడ జెండా పాతేశారు. ఆయనను కాదని రాధాకు టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదు. కాపు సామాజికవర్గానికి చెందిన బొండా ఉమామహేశ్వరరావు సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత కావడం, పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడటం, గత ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలు కావడం వంటి కారణాలు ఆయనే క్యాండిడేట్ అని చెప్పక తప్పదు.
యాక్టివ్ గా లేకపోవడంతో…
వంగవీటి రాధా కూడా పార్టీలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. ఆయన రంగా జయంతి, వర్ధంతి సందర్భాల్లో తప్పించి బయటకు రావడం కూడా అరుదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలకు మంచి మిత్రుడుగా ఉండటం కూడా రాధాకు టీడీపీలో మైనస్ పాయింట్ గా చెబుతారు. కానీ వంగవీటి రాధా కాంట్రవర్సీ నేత కాదు. తన పనేదో తాను చూసుకుంటారు. మెతక మనస్తత్వం. ఎవరి పట్ల పరుషంగా మాట్లాడను కూడా మాట్లాడరు. అలాంటి రాధ ఈసారి ఎక్కడి నుంచి పోటీచేస్తారన్న దానిపై చర్చజరుగుతుంది. రాధాను పార్లమెంటుకు పోటీ చేయించే అవకాశాలు కూడా లేకపోలేదు. మచిలీపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది.
పార్లమెంటుకు…
కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకు కావాలంటే ఇప్పడు పనవ్ కల్యాణ్ తో పొత్తు ఎటూ ఉండనే ఉంది. అందువల్ల రాధాతో టీడీపీకి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. కాకుంటే కుటుంబ నేపథ్యంతో ఆయనను పార్లమెంటు కు పంపాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనపడుతుంది. అయితే ఇందుకు రాధాతో పాటు ఆయన అనుచరులు అంగీకరిస్తారా? ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేస్తే ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు? జనసేనలోకి మారి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీలో ఉంటారా? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం ఇవ్వాలి. రాధా జనసేనతో కూడా టచ్ లో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద రాధా ఈసారైనా అసెంబ్లీలోకి అడుగుపెడతారా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.