తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంతో రాజాసింగ్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది. గోషామహల్ కు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఆ సస్పెన్షన్ వేటును బీజేపీ తొలగించలేదు. దీంతో ఆయన బీజేపీలో ఉన్నారా? లేదా? అన్నది కూడా అర్థం కాని విధంగా ఉంది. బీజేపీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయనకు పార్టీ నుంచి ఎలాంటి ఆహ్వానాలు అందడం లేదు.
పార్టీ మారుతున్నారని…
దీంతో రాజాసింగ్ బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరతారని సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. దీనికి తోడు రాజాసింగ్ మంత్రి హరీశ్ రావును కలవడం కూడా ప్రాధ్యానత సంతరించుకుంది. అయితే దీనిపై రాజాసింగ్ వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గంలో ఆసుపత్రి నిర్మాణం విషయంలో చర్చించడానికే హరీశ్ రావును కలిశానని రాజాసింగ్ తెలిపారు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేసినా, కొనసాగించినా తాను పార్టీ మారబోనని ఆయన స్పష్టం చేశారు.