ఒకవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విరుచుకుపడుతుండగానే మరొక వైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా వాలంటీర్ల వ్యవహారశైలిని తప్పుపట్టారు. మంగళగిరిలో జరిగిన మహిళాశక్తి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేశారు. మహిళలు ఉండగా ఇళ్లలోకి దూరే హక్కు వీరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని జగన్ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడని, ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తామని చంద్రబాబు చెప్పారు. అనుమతి లేకుండా ఇళ్లలోకి ప్రవేశించిన వాలంటీర్లను మహిళలే ఇళ్ల బయటకు తరిమి కొట్టాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
పిల్లలను కనండి…
తాను రెండు రోజుల్లో బ్యాండ్ పంపిస్తానని, 41 రోజుల దానిని పూజ చేసి దీక్ష చేపట్టాలని కోరారు. మహిళలు శక్తివంతంగా తయారు చే్యడమే తన లక్ష్యమన్న చంద్రబాబు పురుషుల కంటే మహిళలకే తెలివితేటలు ఎక్కువని తెలిపారు. కట్నం లేకుండానే పెళ్లిళ్లు నేడు జరుగుతున్నాయంటే మహిళల శక్తి ఏంటో అర్థమయిందన్నారు. గతంలో కుటుంబ నియంత్రణ పాటించాలని తాను చెప్పానని, అయితే తాను మాత్రం ఇప్పుడు తిరిగి పిల్లలను కనాలని సూచిస్తున్నానని పిలుపు నిచ్చారు. మహిళకు స్పీకర్ గా అవకాశమిచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే చెల్లిందన్న చంద్రబాబు మహిళలకు వంటగ్యాస్ కనెక్షన్ ఇచ్చిన తాము అధికారంలోకి రాగానే ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.