ఎన్నికలంటే ప్రతి ఓటూ కీలకమే. అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయిన వారు కొందరుంటే.. అదే ఓట్లతో శాసనసభకు వెళ్లిన వారు మరికొంత మంది ఉన్నారు. అందుకే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటర్లను ఖచ్చితంగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. తమకు పడే ప్రతి ఓటు తమ జాతకాన్ని మారుస్తుందని తెలుసు. అందుకే అన్ని జాగ్రత్తలు పోలింగ్ డే రోజు తీసుకుంటారు. అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయిన వారు ఐదేళ్లు మరోసారి పవర్ కోసం ఎదురు చూడాల్సిందే. అలాగే తక్కువ ఓట్లతో గెలుపొందిన వాళ్లు ఈసారి అధిక ఓట్లను పొందేందుకు శ్రమించాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో అలాంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే.. అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అనే చెప్పాలి.గెలుపు
అంత సులువు కాదు…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపు అంత సులువు కాదు. ఎవరికీ అంత ఈజీ కాదు. నగరం కావడంతో జనం నాడి ఎలా ఉంటుందో తెలుసుకోవడం కష్టం. చివరి నిమిషంలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఈవీఎంపై బటన్ నొక్కే సమయానికి కూడా ఓటరు తన మనసును మార్చుకునే వీలుంటుంది. డబ్బులతో పాటు అక్కడ చేపట్టిన పనులు కూడా ప్రాధాన్యత చూపుతాయి. ప్రధానంగా నగరాల్లో ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించగలిగితే ఆ రాజకీయ నేతకు మనుగడ ఉంటుంది. ఏమాత్రం అలసత్వం చూపినా జనం ఎన్నికల సమయంలో తమ సత్తా చూపుతారు. అప్పుడు ఎవరిని నిందించినా ప్రయోజనం శూన్యం.
అతి తక్కువ ఓట్లతో…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 2009తో ఏర్పడింది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లాది విష్ణు విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణుకు 52,426 ఓట్లు రాగా, అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి వంగవీటి రాధాకు 51,578 ఓట్లు వచ్చాయి. అప్పట్లో 848 ఓట్ల తేడాతోనే వంగవీటి రాధా ఓటమి పాలు కాగా, మల్లాది విష్ణు అదే ఓట్లతో గెలుపొందారు. అప్పుడు సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన చిగురుపాటి బాబూరావుకు 38,273 ఓట్లు వచ్చాయి. అంటే తొలి ఎన్నికలోనే మల్లాది విష్ణు అతి తక్కువ ఓట్లతో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బొండా ఉమామహేశ్వరరావు విజయం సాధించారు. బొండ ఉమకు నాటి ఎన్నికల్లో 82,669 ఓట్లు వచ్చాయి. ఆయనపై పోటీ చేసిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డికి మాత్రం 55,508 ఓట్లు వచ్చాయి. మెజారిటీ 27,161 ఓట్లు వచ్చింది.
పోటా.. పోటీ…
గత ఎన్నికల ఫలితాలను తీసుకుంటే…. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎన్నిక హోరా హోరీగా జరిగిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు విజయం సాధించారు. రాష్ట్రంలోనే అతి తక్కువ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు నిలిచారు. కేవలం 25 ఓట్ల తేడాతోనే ఆయన గెలుపొందారు. వైసీపీ తరుపున పోటీ చేసిన మల్లాది విష్ణుకు 70,721 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొండా ఉమామహేశ్వరరావుకు 70,721 ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి. అయితే కేవలం ఇద్దరి మధ్య గెలుపునకు ఓట్ల తేడా మాత్రం 25 మాత్రమే. గత ఎన్నికల్లో సీపీఎం నుంచి పోటీ చేసిన చిగురుపాటి బాబూరావుకు 29,333 ఓట్లు వచ్చాయి. నోటాకు 1,016 ఓట్లు పడటం విశేషం. అంటే నోటాకు పడిన ఓట్లు అభ్యర్థులు తలరాతను మార్చేశాయనే చెప్పాలి.
ఎవరి వ్యూహాలు వారివి…
అందుకే ఈసారి విపక్షాలన్నీ ఏకమైనా గెలుపు సాధించేందుకు అవసరమైన ఓటు బ్యాంకును అధికార వైసీపీ ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉంది. అదే సమయంలో ఓట్లు చీలకుంటే ఈసారి విజయం తమదేనన్న ధీమాలో విపక్షాలున్నాయి. ఇలా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపు తమదేనని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, లేదు.. లేదు… ఈసారి సెంట్రల్లో జెండా ఎగరేస్తాం అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మరోసారి బొండా ఉమా మహేశ్వరరావు అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో మరోసారి ట్రయాంగల్ ఫైట్ తప్పేట్లు లేదన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే మాత్రం సీపీఎం బరిలో ఉంటుంది. సీపీఎంకు సెంట్రల్ నియోజకవర్గంలో కొంత ఓటు బ్యాంకు ఉండటంతో వాళ్లు చీల్చే ఓట్లు ఎవరికి లాభం…? ఎవరికి నష్టం అన్న చర్చ జరుగుతుంది. వైసీపీ కూడా అభ్యర్థిని మార్చే అవకాశాలున్నాయన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈసారి కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగానే సాగుతుంది.