తెలంగాణ ముఖ్యమంత్రి మనవడు హిమాన్ష్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని కోటి రూపాయలతో అభివృద్ధి చేశారు. దీంతో మిగిలిన పాఠశాల పిల్లలు కూడా తమ స్కూళ్లను దత్తత తీసుకోవాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. హైదరాబాద్ లోని నారాయణగూడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ స్కూల్ లో వసతులు కల్పించేందుకు హిమాన్ష్ సహకరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. పిల్లలు ప్లకార్డు పట్టుకుని ఆందోళనకు దిగడంతో ఉపాధ్యాయులు సయితం విస్తుపోయారు.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదని…
తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ పాఠశాలలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ వారు నినదించారు. విద్యాశాఖ అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదన్న విద్యార్థులు తమకు సరైన ఆటస్థలం లేదని, కంప్యూటర్లు లేవని చెబుతున్నారు. హిమాన్షు అన్న వచ్చి తమ పాఠశాలను బాగుపర్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.