తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. రాష్ట్రంలో గంజాయి విక్రయాలపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీని వల్ల యువత చెడిపోతుందని, గంజాయి విక్రయాలు అరికట్టేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావాలని లోకేష్ గవర్నర్ ను కోరారు. తన పాదయాత్రలో ప్రజల నుంచి గంజాయిపైనే ఎక్కువ ఫిర్యాదులు అందాయని లోకేష్ గవర్నర్ కు వివరించారు. శాంతి భద్రతలు క్షీణించడానికి కూడా గంజాయి కారణమని గవర్నర్ కు ఇచ్చిన వినతి పత్రంలో లోకేష్ పేర్కొన్నారు.
గంజాయి విక్రయాలతో…
రాజ్ భవన్ నుంచి బయటకు వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జాబ్ క్యాపిటల్ గా ఏపీ ప్రస్తుతం డ్రగ్స్ క్యాపిటల్ గా మారిందని విమర్శించారు. డీఆర్ఐ నివేదికల ప్రకారం ఏపీ దేశంలో గంజాయి విక్రయంలో అగ్రస్థానంగా ఉందని లోకేష్ తెలిపారు. దీంతో పాటు హవాలా మార్గం ద్వారా పెద్దయెత్తున డబ్బులు చేతులు మారుతున్నాయని కూడా లోకేష్ ఆరోపించారు. ఇది రాష్ట్ర్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయన్న లోకేష్, జగన్ ప్రభుత్వం దిగిపోతేనే గంజాయి విక్రయాలకు అడ్డుపడుతుందని అన్నారు.