జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ ఏకపత్నీ వ్రతుడని ఎద్దేవా చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వారాహి వాహనం ఎక్కి ఊగిపోతున్న పవన్ కల్యాణ్ జగన్ ను ఏమైనా అంటే తమకు కోపం వస్తుందని, తాము పవన్ ఏమన్నా ఆయనకు కోపం రాదని ఎద్దేవా చేశారు. ఆయన పక్కన ఉండే నాదెండ్ల మనోహర్ ను కార్మిక వీరుడిగా అంబటి రాంబాబు సంభోదించారు. టీడీపీ ఆఫీసు నుంచి జనసేన కార్యాలయానికి రహస్య సొరంగ మార్గం తవ్వడానికి పనిచేస్తున్న కార్మిక వీరుడు నాదెండ్ల మనోహర్ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.
ఎందుకంత ఊగడం?
పవన్ కు మల్లిపుల్ పర్సనాలిటీ డిజార్టర్ ఆవరించింది అంటే కోపం వచ్చిందని, అలాగే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని నిజం చెప్పినా ఆయనకు ఆగ్రహం ఆగడం లేదని, అందుకే ఇకపై ఆయనను ఏకపత్నీవ్రతుడని పిలుస్తామంటూ అంబటి సెటైర్ వేశారు. తణుకు సభలో కొద్దిసేపు ప్రశాతంగా మాట్లాడి అంతలోనే ఊగిపోవడం దేనికి చిహ్మమని మంత్రి ప్రశ్నించారు. రెండు ప్యాకేజీలుగా ఉన్న వరాహం యాత్రను దిగ్విజయంగా ముగించిన పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు. పవన్ తిరిగి రావాలంటే ఒక లెక్కుందని, ఆ లెక్కలేనిదే మళ్లీ ఏపీలో కాలుమోపరని అన్న అంబటి యాత్ర అంతా ఎంత అమర్యాదగా పవన్ వ్యహరించారో ప్రజలు గమనించారని అన్నారు.