ఇప్పటికే టమాటా ధరలతో పాటు కూరగాయల ధరలు కొండెక్కాయి. కూరగాయలు కొనుగోలు చేయడం భారంగా మారింది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా నింగినంటాయి. టమాటా అయితే బయట మార్కెట్ లో మూడు వందల రూపాయలు కిలో పలుకుతుంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడి పోతున్నారు. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతుండటంతో ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి.
కిలో రూ.100 వరకూ…
టమాటా ధరతో పాటు పచ్చిమిర్చి ధర కూడా భారీగా పెరిగింది. భారీ వర్షాలు, ఉత్తరాదిన కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయల ధరలు పెరిగాయన్నది ప్రభుత్వ వాదన. దీనికి తోడు దిగుబడి కూడా తగ్గిందని వ్యవసాయ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే టమాటాతో పాటు వంటింట్లో అవసరమైన ఉల్లి ధరలు కూడా కొండెక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఉల్లి ధరలు ముప్ఫయి నుంచి ముప్ఫయి ఐదు రూపాయలుండగా త్వరలోనే కిలో వందకు చేరుకునే అవకాశముందని నేషనల్ కమొడిటీస్ మేనేజ్ మెంట్ సర్వీస్ లిమిటెడ్ సీఈవో సంజయ్ గుప్తా తెలిపారు. దీంతో వంటింట్లో ఇక ఉల్లిఘాటు మామూలుగా ఉండేలా లేదు.