ఎన్నికలు దగ్గరపడే కొద్దీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేసింది. మూడోసారి గెలుపు లక్ష్యంతో ఆయన అనేక పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రకటించిన పథకాలను ప్రజలకు అందించి తద్వారా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీని కొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు మ్యానిఫేస్టోతో మరిన్ని పథకాలతో ప్రజల ముందుకు వెళ్లి వారి నమ్మకం సంపాదించాలంటే తొలుత తాము ప్రకటించిన పథకాలను అమలు చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ముందుకు వెళుతున్నారు.
ఒక్కొక్కరికి మూడు లక్షలు
అందులో భాగంగా త్వరలోనే గృహలక్ష్మి పథకం కింద లబ్దిదారుల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పేదల కోసం ఈ పథకాన్ని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన ఇప్పటికే పలు సభల్లో వెల్లడించారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న వారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందచేయనుంది. సొంత స్థలం ఉండి నిర్మాణం చేసుకోలేని పేదలకు మూడు లక్షలు ఇచ్చి వారి ఇంటి నిర్మాణంలో ప్రభుత్వం చేదోడుగా నిలవాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
అర్హులైన లబ్దిదారులు…
ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారులు దరఖాస్తు చేసుకునేందుకు త్వరలోనే వీలు కల్పించాలని నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరించనున్న ఈ పథకంలో అర్హులైన వారిని ఎంపిక చేసే బాధ్యత ఇన్ ఛార్జి మంత్రికి అప్పగించారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. మూడు దశల్లో మూడు లక్షల రూపాయలను ఎంపికయిన లబ్దిదారులకు అందచేస్తారు. ఈ మూడు లక్షలు పూర్తిగా ఉచితమే. తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనిలేదు. ఈ దరఖాస్తుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్ లో పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల మంది లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ఆర్థిక సాయాన్ని అందచేయనున్నారు.