ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఎవరు ఎలాంటి పొత్తులు పెట్టుకుంటారు? బీజేపీ, టీడీపీ పొత్తు సాధ్యమేనా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరిక మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పార్టీలన్నీ ఏకమవుతాయా? అనే ప్రశ్నలకు అనుమానాలే కలుగుతున్నాయి. బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేయడం దాదాపుగా అసాధ్యమని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తును బలంగా కోరుకుంటున్నప్పటికీ కమలనాధులు మాత్రం సైకిల్ తో సవారీకి అంత ఆసక్తి లేరని అర్థమవుతుంది. గతంలో జరిగిన పొరపాట్లు మరొకసారి జరగనివ్వకపోవడం, తాము ఏపీలో ఎదగాలంటే టీడీపీతో పొత్తు వద్దని కొందరు నేతలు గట్టిగా పట్టుబట్టడం వంటి కారణాలతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందంటున్నారు.
భేటీ తర్వాత…
ఆ మధ్య అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత పొత్తు కుదురుతుందన్న వార్తలు వచ్చాయి. అందుకోసమే ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని చంద్రబాబు అనుకూల మీడియా కూడా రాసింది. అయితే రానురాను పొత్తులపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎందుకంటే రేపు జరగాల్సిన మిత్రపక్షాల భేటీకి బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం లేదు. ఆహ్వానం అందితే వెళ్లేవారా? లేదా? అన్నది పక్కన పెడితే అసలు ఇన్విటేషన్ పంపకపోవడంతో టీడీపీతో సయోధ్యకు కేంద్ర నాయకత్వం సుముఖంగా లేదన్నది అర్థమవుతుంది. అందుకోసమే బీజేపీ మిత్ర పక్షాల సమావేశానికి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం లేకుండా దూరంగా ఉంచిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ముప్ఫయి పార్టీలకు…
ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తాము మిత్రులుగా భావించే ముప్ఫయి పార్టీలకు ఆహ్వానం పంపింది. రేపు ఢిల్లీలోని స్టార్ హోటల్ లో ఈ సమావేశం జరగనుంది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు జరిగే ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్న చిన్న పార్టీలతో కలసి జట్టుగా ఉండి విపక్షాలను ఎదుర్కొనాలన్నది కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. అయితే ఇందులో దక్షిణాదిన అతి పెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మాత్రం చోటు లేదు. అంటే మిత్రుడిగా టీడీపీని బీజేపీ భావిస్తున్నట్లు కనిపించడం లేదన్నమాట. వచ్చే ఎన్నికలలో జనసేన తమను వదలివెళ్లినా ఒంటరిగానైనా పోటీ చేయాలన్న ఉద్దేశ్యమే కమలం పార్టీలో కనిపిస్తుంది.
శత్రువుగానే…
2014 ఎన్నికలకు ముందు వరకూ బీజేపీతో కలసిన టీడీపీ 2018లో విడిపోయింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం కారణంగానే తాము కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆగకుండా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, మోదీ వైఖరికి వ్యతిరేకంగా దీక్షలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ తో చేతులు కలిపారు. దీనిని సీరియస్ గా తీసుకున్న కేంద్ర నాయకత్వం చంద్రబాబుతో కలసి పనిచేయడం ఇక జరగదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకే రేపటి సమావేశానికి పిలుపు లేదు. తన మిత్రపక్షంగా ఉన్న జనసేనకు మాత్రం ఆహ్వానం అందింది. రేపటి సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. కానీ టీడీపీకి పిలుపు లేకపోవడంతో ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.