భారతీయ జనతా పార్టీ యేతర పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. మోదీ సర్కార్ మూడో దఫా తిరిగి గద్దెనెక్కే అవకాశం ఇవ్వకూడదని ఇరవై నాలుగు పార్టీలు దేశ వ్యాప్తంగా ఒక్కటవుతున్నాయి. ఇప్పటికే పాట్నాలో జరిగిన సమావేశంలో కొన్ని అంశాలపై చర్చించాయి. తాజాగా బెంగళూరు సమావేశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయి. అయితే విచిత్రమేమిటంతే ఈ సమావేశానికి ఎంఐఎం దూరంగా ఉండటమే. దూరంగా ఉండటమే కాదు. ఆ పార్టీని విపక్ష పార్టీలు కూడా దూరం పెట్టాయని చెప్పొచ్చు. ఒవైసీకి కనీసం విపక్షాల కూటమి సమావేశానికి ఆహ్వానం లేకపోవడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇందుకు కారణాలేమై ఉంటాయా? అని ఆసక్తిగా ఆరా తీసే వారు కూడా ఎక్కువయ్యారు.
బీజేపీని వ్యతిరేకించే…
ఎంఐఎం .. ఫక్తు బీజేపీని వ్యతిరేకించే పార్టీ. అలాగే బీజేపీ కూడా హిందూమతం కోసం పనిచేసే పార్టీ. ఇందులో ఎలాంటి తేడా లేదు. 2014 ముందు వరకూ ఎంఐఎం కాంగ్రెస్ తో కలసి నడిచేది. కాంగ్రెస్ లౌకిక వాద పార్టీగా ముద్రపడటంతో ఆ పార్టీతో ఒవైసీ తన ప్రయాణాన్ని దేశంలోనూ, ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ కొనసాగించారు.అయితే రాష్ట్ర విభజన జరగడం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతోనే ఒవైసీ తన రూటు మార్చుకున్నారు. అప్పటి వరకూ కాంగ్రెస్ వెంట నడిచిన ఒవైసీ రాష్ట్రంలో బీఆర్ఎస్ మద్దతుదారుగా మారిపోయారు. కలసి పోటీ చేయకున్నా బీఆర్ఎస్ ఎంఐఎంను తమ మిత్రపక్షంగానే భావించి అన్ని రకాల రాజకీయ ప్రయోజనాలను దానికి సమకూరుస్తుంది.
కాంగ్రెస్ కు శత్రువుగా…
దీంతో పాటు బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మహారాష్ట్రలలో ఎంఐఎం పోటీ చేసి బీజేపీకి పరోక్షంగా లబ్ది చేకూర్చిందన్న వాదనలు కూడా విపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికే ఎంఐఎం అధినేత ఒవైసీ తమ అభ్యర్థులను ఆ యా రాష్ట్రాల్లో రంగంలోకి దించుతున్నారన్న విమర్శలు కూడా రాజకీయంగా బాగానే వినిపించాయి. కానీ ఒవైసీ మాత్రం విమర్శలను లెక్క చేయకుండా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. అది కాంగ్రెస్ కు నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒవైసీ పార్టీ కారణంగానే కొన్ని రాష్ట్రాల్లో తమకు దక్కాల్సిన స్థానాలు రాకుండా పోయాయని కూడా అంటున్నారు.
అందుకే ఆహ్వానం…
దీంతో కాంగ్రెస్ సహజంగానే ఎంఐఎంను పక్కన పెట్టింది. తెలంగాణలోనూ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంను శత్రువుగా భావిస్తుంది. అందుకే ఈరోజు, రేపు జరిగే సమావేశాలకు ఎంఐఎంకు పిలుపు లేదు. బీజేపీ రహస్య మిత్రుడిగా ఒవైసీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో ఆరోపించారు. అటువంటి ఒవైసీని సమావేశానికి ఆహ్వానిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరదన్న కారణంగా దూరంగా ఉంచింది. బీజేపీ, కాంగ్రెస్ లకు దూరంగా ఒవైసీ ఒంటరిగానే తన రూట్లో వెళుతున్నారు. హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎంను దేశంలో విస్తరించాలన్న ఒవైసీ ఆలోచనకు గండికొట్టాలన్న వ్యూహంతో కాంగ్రెస్ ఉన్నట్లు కనపడుతుంది. అందుకే ఇన్విటేషన్ పంపకుండా ఒవైసీని తన వాడు కాదని చెప్పకనే చెప్పిందంటున్నారు.