తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాట తప్పారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భద్రాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గోదావరి వరద బాధితులను కేసీఆర్ అన్యాయం చేశారని, మాట ఇచ్చి తప్పారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పేర్కొన్నారు.
మాట తప్పారంటూ…
గత ఏడాది సంభవించిన వరదల కారణంగా భద్రాచలంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ సమయంలో అక్కడ పర్యటించిన కేసీఆర్ గోదావరి వరద కట్ట నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆ హామీ తప్పడమే కాకుండా అప్పట్లో వరదల కారణంగా నష్టపోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఇస్తామని ప్రకటించారని, వాటిని అమలు చేయకుండా కేసీఆర్ మాట తప్పారంటూ పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ఫిర్యాదును స్వీకరించారు. అంతే తప్ప కేసు నమోదు చేయలేదు.