ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు మాగుంట రాఘవకు బెయిల్ లభించింది. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరుచేసింది. నాలుగు వారాల పాటు రాఘవకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అనారోగ్య కారణాలతో రాఘవకు బెయిల్ ఇస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవ గత కొద్ది రోజుల నుంచి జైలులో ఉన్నారు.
షరతులతో…
ఆయన పలుమార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. అయితే అనారోగ్య కారణాలతో నాలుగు వారాలపాటు బెయిల్ ఇస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మాగుంట రాఘవకు కొన్ని షరతులు విధించింది. కేసు విచారణకు సహకరించాలని, చెన్నై నగరానికే పరిమితమవ్వాలని పేర్కొంది. ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు కావాలని తెలిపింది. పాస్ పోర్టును న్యాయస్థానానికి సరెండర్ చేయాలని, దేశం విడిచి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం నాలుగు గంటలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాలని చెప్పింది.