బెంగళూరులో విపక్షాల సమావేశంలో నేతలు ఐక్యతారాగం వినిపించారు. కలసి కట్టుగా ఉంటామంటూ ఫొటోలకు పోజులిచ్చారు. అయితే ఎన్నికల వరకూ ఈ ఐక్యత కొనసాగుతుందా? అన్నదే ప్రశ్న. కాంగ్రెస్ లీడ్ చేస్తున్న ఈ సమావేశానికి పెద్దయెత్తున పార్టీల నేతలు హాజరయ్యాయి. 26 పార్టీల నేతలు హాజరై తాము మోదీకి వ్యతిరేకమంటూ నినదించారు. అంత వరకూ బాగానే ఉంది. 2024 ఎన్నికల వరకూ ఈ ఐక్యత ఎంత వరకూ సాధ్యమన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందరిదీ ఒకటే మాట. మోదీని గద్దె దించాల్సిందే. అందుకు అందరం ఒక పట్టుపట్టాల్పిందే.
తమ రాష్ట్రాల్లో…
వినేందుకు.. చూసేందుకు మాత్రం ఈ నినాదం బాగుంది. కానీ కార్యాచరణలో మాత్రం సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలున్నాయి. ఎంపీ స్థానాలు అత్యధికంగా గెలుచుకోవాలని అందరికీ ఉంటుంది. తమ పార్టీకి చెందిన వారు లోక్ సభకు ఎక్కువ మంది వెళ్లాలని నేతలు భావిస్తారు. అందుకే తమ రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలను దక్కించుకునేందుకే ప్రధమ ప్రాధాన్యత ఇస్తారు. ఎన్నికలకు ముందు పొత్తులంటే అది సాధ్యం కాని పని. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటే అన్ని పార్టీలకు పందేరం చేయాల్సి వస్తుందన్న భావన ప్రధానంగా ప్రాంతీయ పార్టీల అధినేతల్లో ఉంటుంది. అందుకే వారు ఎన్నికలకు ముందు పొత్తును వారు వ్యతిరేకిస్తుంటారు. ఎన్నికల అనంతర పొత్తుకే మొగ్గు చూపుతుంటారు.
ఎంపీ స్థానాలు…
పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ కావచ్చు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు. బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్, జనతాదళ్, జార్ఖండ్ జేఎంఎం, వంటి పార్టీలు తమ రాష్ట్రాల్లో పట్టున్నాయి. ఆ పట్టు కోల్పోయేందుకు ఆ పార్టీలు సహజంగానే ఇష్టపడవు. అందుకే కాంగ్రెస్ తో నేరుగా ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకునేందుకు ఇష్టత చూపవు. అప్పుడు ప్రస్తుతం సమావేశమైన పార్టీలన్నీ ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా అధికార పార్టీ, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. సహజంగానే అది అధికార పార్టీకి ప్లస్ గా మారుతుంది. అందుకనే అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజీగా మారకుండా ముందస్తు పొత్తు పెట్టుకోవాలన్నది కొందరి ఆలోచన.
పొత్తు పెట్టుకుంటే…
అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకూ ఐక్యత ను చాటే విపక్ష పార్టీలన్నీ తమ తమ రాష్ట్ర్రాల్లో బలం చాటు కునేందుకు ఒంటరిగానే పోటీ చేస్తాయి. అవసరమైతే లోకల్ గా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు తప్పించి జాతీయ పార్టీలను దరి చేరనివ్వవు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్ర్రంలో మమత బెనర్జీ కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టులను కూడా కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయరు. ఒక్క తమిళనాడుకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. అక్కడ డీఎంకే కాంగ్రెస్ కు తక్కువ సీట్లు ఇచ్చి ముందస్తు పొత్తు పెట్టుకుంటుంది. అంతే తప్ప మెజారిటీ రాష్ట్రాల్లో ముందస్తు పొత్తు అనేది సాధ్యపడదు. అందుకే మోదీ బిందాస్ గా ఉన్నారంటారు. పార్లమెంటు సమావేశాల వరకూ ఈ ఐక్యత కొనసాగవచ్చు. కానీ ఆ తర్వాత?