వచ్చే ఎన్నికల్లో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలసి పోటీ చేసే అవకాశముందని ఆయన తెలిపారు. ఎన్డీఏ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీడీపీల మధ్య అండర్ స్టాండింగ్ ఉందని తెలిపారు. రెండు పార్టీల మధ్య కొన్ని సమస్యలు కూడా ఉన్నాయన్న అవేవో తనకు తెలియదని ఆయన తెలిపారు.
వైసీపీని గద్దె దించడమే…
వైసీపీని అధికారం నుంచి గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని తెలిపారు. మోదీ ప్రభుత్వంపై దేశంలో సానుకూల అభిప్రాయం ఉందన్న పవన్ తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి లేదని తెలిపారు. ఎన్నికల ఫలితాలను బట్టి ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయిస్తామని పవన్ తెలిపారు. ప్రజలతో పాటు పార్టీలన్నీ కలసికట్టుగా పనిచేయాలన్నారు.