సినీనటులు జీవితారాజశేఖర్ దంపతులకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. జరిమానా కూడా విధించింది. నాంపల్లిలోని పదిహేడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ తీర్పు చెప్పింది. పరువు నష్టం దావా కేసులో రాజశేఖర్ దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష విధించడం సంచలనం కలిగించింది. 2011లో అల్లు అరవింద్ వీరిపై పరువు నష్టం దావా వేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుపై రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనివల్ల తమ సంస్థ పరువు పోయిందని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
పరువు నష్టం కేసు….
చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా సేకరించిన రక్తాన్ని బయట అమ్ముకుంటున్నారని రాజశేఖర్, జీవితలు ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆరోపించడంతో ఈ వ్యాఖ్యలు తమను బాధించాయని, వారిపై పరువు నష్టం కేసు వేశారు. దీనిపై విచారించిన నాంపల్లి కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఐదువేల రూపాయల జరిమానా విధించింది. అయితే దంపతుల విజ్ఞప్తి మేరకు తాత్కాలిక బెయిల్ ను న్యాయమూర్తి మంజూరు చేశారు.