ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నేతలు పార్టీలు మారుతుండటం కామన్. తమకు సీటు దక్కదని భావించిన నేతలు జంప్ అవుతారు. అలాగే అధికార పార్టీకి ఎప్పుడూ ఆ విషయంలో డిసట్వాంజే. ఎందుకంటే ఎక్కువ మంది నేతలు కిక్కిరిసి పోయి ఉంటారు. టిక్కెట్ల ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో పాటు గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా సహజం. ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. ఏ పార్టీ నుంచైనా మరొక పార్టీలో దూకడానికి సిద్ధంగా ఉంటారు. ఏమాత్రం సంకోచించరు. ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అధికార పార్టీ కూడా అటువంటి వారిని కొంత బుజ్జగిస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని ఊరిస్తుంది. వినేవాళ్లు కొంతమంది. వినని వాళ్లు ఎంతో మంది. ఇప్సుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
కిక్కిరిసి పోవడంతో…
కారు పార్టీ నేతలతో కిక్కిరిసి పోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవని భావించిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. బలమైన పార్టీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు. జూపల్లి కృష్ణారావు అవ్వొచ్చు. పార్టీ మారింది సీటు కోసమే. చట్ట సభల్లో అడుగు పెట్టడం కోసమే. తాజాగా మరో నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డితో కలసి తన సీటుపై చర్చించినట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తం చూసుకుని తీగల జంప్ అయిపోవడానికి సిద్ధమయ్యారు.
టీడీపీ నుంచి బీఆర్ఎస్…
తీగల కృష్ణారెడ్డి టీడీపీలో ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి విజయం సాధించారు. అయితే 2018లో తిరిగి బీఆర్ఎస్ నుంచి మహేశ్వరం నుంచి తీగల పోటీ చేసినా ప్రజలు ఆదరించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. అనంతరం ఆమె కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. మంత్రి అయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ సబిత మహేశ్వరం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాను బీఆర్ఎస్ లో ఉంటే సీటు దక్కదని భావించిన తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
టిక్కెట్ కన్ఫర్మ్….
మేయర్, ఎమ్మెల్యేగా తనకంటూ మహేశ్వరం నియోజకవర్గంలో ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకున్న తీగల కృష్టారెడ్డి త్వరలో కాంగ్రెస్ ల్ చేరనున్నారు. ఆయన ఇప్పటికే తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆషాఢ మాసం వెళ్లిపోగానే శ్రావణమాసంలో పార్టీలో చేరేందుకు తీగల అంతా సిద్ధం చేసుకుంటున్నారు. తీగల రాకతో మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. తీగలకు కాంగ్రెస్ పెద్దలు టిక్కెట్ గ్యారంటీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో చేరాలా? లేక నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టి చేరిపోవాలా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.