మోదీ బలంగా ఉన్నాడు. శత్రువులను చీల్చి తన వైపునకు రప్పించుకోవడంలో మోదీ దిట్ట. అలాంటి మోదీ తో కాంగ్రెస్ కవ్వింపు చర్యలకు దిగడం రాజకీయంగా నష్టం చేస్తుందంటున్నారు విశ్లేషకులు. 2024 ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో వరసగా బీజేపీయేతర పార్టీలన్నీ కలసి సమావేశం కావడానికి ఇది సరైన సమయం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలే మోదీ… విపక్షాలు ఏ మాత్రం బలపడతాయని భావించినా వెంటనే అప్రమత్తమవుతారు. విపక్షాల్లో చీలికలు తెస్తారు. విపక్ష కూటమిని పేలికలు చేసిందాకా మోదీ నిద్రపోరు. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రస్తుతం I.N.D.I.A లో ఉన్న 26 పార్టీల్లో చివరకు ఎన్ని పార్టీలు మిగులుతాయన్నది సందేహమే.
ఇంకా తొమ్మిది నెలలు…
లోక్ సభ ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఎన్నికలకు ముందు సమాయత్తం అవ్వడం ఏ రాజకీయ పార్టీకి అవసరమే. కానీ ముందుగానే రెడీ అయిపోతే శత్రువు అప్రమత్తమై జాగ్రత్త పడతాడు. మోదీ విషయంలో ఇదే జరుగుతుంది. పాట్నా, బెంగళూరులో విపక్ష నేతల సమావేశం తర్వాత మోదీ అలర్ట్ అయ్యారన్నది వాస్తవం. అందుకే ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమకు 38 పార్టీల మద్దతు ఉందని ప్రజలకు చెప్పగలిగారు. అంకెల్లో కూడా తమదే పై చేయి అనిపించుకునేలా బీజేపీ వ్యూహరచన చేసింది. చిన్నాచితకా పార్టీలన్నింటినీ చేరదీసింది. విపక్ష కూటమి కంటే తామే బలమైన కూటమి అని చెప్పగలిగింది.
పార్టీలను చీల్చడంలో…
ఇక కాంగ్రెస్ లో ఉన్న26 పార్టీల నేతలు ఎన్నికల సమయం వరకూ కొనసాగుతారన్న నమ్మకం లేదు. కొత్తగా మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ రావడం కాంగ్రెస్ కూటమికి కొంత బలం చేకూర్చినప్పటికీ సీట్ల పంపకాల్లో మాత్రం ఎవరూ తగ్గరు. ఇచ్చినన్ని సీట్లు ఇస్తేనే కాంగ్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న స్థానాలకు తోడు కాంగ్రెస్ అదనంగా సీట్లు తెచ్చుకోవాలంటే లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలు ఎక్కువ తెచ్చుకోగలిగితే అంత హస్తం పార్టీకి మంచిది. ఉత్తరాదిన బీజేపీ బలం తగ్గిందన్న అంచనాల మధ్య కాంగ్రెస్ పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సరైన నేత….
అయితే ఈ సమయంలో మిత్రపక్షాలకు లోక్ సభ స్థానాలను కొన్ని చోట్ల వదిలేసినా పూర్తి స్థాయిలో విజయం సాధించాలంటే కూటమికి నేత అవసరం అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అది రాహుల్ గాంధీ కావచ్చు. నితీష్ కుమార్ కావచ్చు. ఏదో ఒక పేరును త్వరలో ఖరారు చేసి జనంలోకి వెళితే కొంత విశ్వాసాన్ని చూరగొనే వీలుంటుంది. నితీష్ కుమార్, రాహుల్ గాంధీలు ఇద్దరూ క్లీన్ చిట్ ఉన్న నేతలే. వీరిరువురి పేర్లను కూటమిలో పరిశీలిస్తున్నట్లు తెలియ వచ్చింది. అయితే ఇంత ముందుగా కాకుండా ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు అంతా ఒక్కటై ఉంటే మోదీ పార్టీ జాగ్రత్త పడటానికి తగిన సమయం ఉండేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.