తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. కనిగిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. పెద అలవలపాడు వద్ద వలస కార్మకులు, గ్రామస్థులతో నారా లోకేష్ ముఖాముఖి మాట్లాడారు. జగన్ వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ మూత పడుతున్నాయని, ఉన్న పరిశ్రమలను కూడా తరిమివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కియాతో పాటు అమరరాజా ఫ్యాక్టరీని కూడా పంపించే ప్రయత్నం జగన్ చేశాడని నారా లోకేష్ మండిపడ్డారు. వ్యాపారస్థులను జగన్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందన్నారు. కనిగిరి నియోజకవర్గం నుంచి అనేక మంది ఇతర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వలసపోతున్నారని, తాము అధికారంలోకి వస్తే వలసలు ఆగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తాగు నీటి కోసం…
ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామని లోకేష్ తెలిపారు. అలాగే కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య కూడా అధికంగా ఉందని, స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామని లోకేష్ తెలిపారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. హార్టి కల్చర్ ను ప్రోత్సహిస్తామన్నలోకేష్ అరటి, మామిడి, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, బత్తాయి, నిమ్మ లో దిగుబడి వచ్చే రకాలను రీసెర్చ్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ ఉద్యాన వన రైతులకు ఇస్తామని లోకేష్ తెలిపారు.