తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనతో పార్టీ పేరును కూడా మార్చారు. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి ఆయన ప్రయత్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్భాటంగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ పార్టీల నేతలతో సమాలోచలను జరిపారు. మేధావులు, రాజకీయ పార్టీలతో వరస సమావేశాలు నిర్వహించారు. ఇటు మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ నుంచి ఇతర పార్టీ నేతలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు. వారందరికీ తెలంగాణ భవన్ లో కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.
ఈ నేతలంతా…
ఇక సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, జేడీఎస్ అధినేత కుమారస్వామి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్, బీహార్ ముఖ్యమంత్రుల మమత బెనర్జీ, నితీష్ కుమార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే నేత స్టాలిన్ తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు. జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూటమిని తయారు చేయాలన్న అభిప్రాయాన్ని వారి ముందు ఉంచారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఖమ్మం సభకు హాజరయ్యారు. ఇదంతా చూసి ప్రత్యామ్నాయ కూటమి రెడీ అవుతుందేమోనని అందరూ భ్రమించారు. కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాల్లో బిజీ అవుతారని అందరూ భావించారు.
తెలంగాణ మోడల్…
మహారాష్ట్రలో భారీ సభలను పెట్టారు. తెలంగాణ మోడల్ ను దేశానికి పరిచయం చేస్తానని చెప్పారు. ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తామని తెలిపారు. దేశంలో ఉన్న నీటి లెక్కలను అనర్గళంగా చెప్పడంతో జనం కూడా మనసు పెట్టి కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. చప్పట్లు కొట్టారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా కనీసం విద్యుత్తును కూడా గ్రామాలకు అందించలేకపోవడం దురదృష్టకరమని ఆవేదన చెందారు. ఇలా కేసీఆర్ జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న తరుణంలో ఆయన నమ్ముకున్ననేతలే షాకి చ్చారు. జేడీఎస్ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ వైపు చూస్తుంది. దీంతో తొలినాళ్లలో కేసీఆర్ వెంట నడిచిన కుమారస్వామి క్రమంగా దూరమయి పోయారు.
కాంగ్రెస్ కూటమి…
ఇక తాజాగా జరిగిన విపక్షాల సమావేశంలో కేసీఆర్ కలిసిన నేతలందరూ ఉన్నారు. శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ, నితీష్ కుమార్ లు కాంగ్రెస్ వెంటే ఉన్నామని ప్రకటించారు. దీంతో కేసీఆర్ జాతీయ స్థాయిలో ఒంటరిగా మారిపోయారు. ఒక్క ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రమే చివరకు కేసీఆర్ వెంట మిగిలారు. బీజేపీకి బీ టీంగా పెద్దయెత్తున బీఆర్ఎస్ పై ప్రచారం జరగడంతో నేతలు క్రమంగా కేసీఆర్ పక్క నుంచి జారుకున్నట్లు చెబుతున్నారు. బీఎస్పీ నేత మాయావతి, టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లు కూడా కేసీఆర్ తో జట్టుకట్టే సాహసం చేయరు. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఇక ఒంటరిగానే పయనించాల్సిందే.